ఇదో విచిత్రమైన కేసు!ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మృతిచెందగా దానిపై ఉద్యమించిన 21మంది తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసు నమోదైంది.
ఏ మహిళకయితే న్యాయం జరగాలంటూ టిడిపి నేతలు ఆందోళన సాగించారో ఆ మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మీదనే ఈ కేసు నమోదు కావటం ఇంకా ఆసక్తికరమైన విషయం. అది కూడా రహస్యంగా జరగడం విశేషం.ఈ కేసులో టిడిపి ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్టు చేసేంతవరకు అసలు కేసు నమోదైన విషయమే టిడిపి నేతలకు తెలియదంట.
అసలేం జరిగిందంటే?
పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాలలో దళిత మహిళ హత్యపై సరైన న్యాయం జరగలేదంటూ టీడీపీ ‘చలో పులివెందుల’ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ కేసులో అసలైననిందితులను వదిలేశారని ప్రచారం జరగడంతో నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిసెంబరు 19న టీడీపీ ర్యాలీ నిర్వహించి, డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమను అవమానించారంటూ మృతురాలి బంధువులు అదే నెల 21న ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
గోప్యంగా కేసు నమోదు
అయితే పులివెందుల పోలీసు స్టేషన్లో 21 మంది టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేత శ్రీరెడ్డి, కడప పార్లమెంటు అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎస్సీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, హరిప్రసాద్, గోవర్ధన్రెడ్డితో పాటు విజయకుమార్రెడ్డి, గురప్ప, జయచంద్ర, హరిక్రిష్ణ, జింకా శ్రీను, బండి జయశేఖర్, అశోక్, కుళ్లాయప్ప, సుదర్శన్, నారాయణ తదితరులపై కేసు నమోదైంది.ఈ కేసులో బీటెక్ రవిని చెన్నైలో ఆదివారం పోలీసులు అరెస్టు చేయడంతో అసలు వారిపై కేసు నమోదైన విషయం బయటపడింది
మళ్ళీ పోలీసులు పప్పులో కాలేశారా!
ఇదిలా ఉండగా ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపై కూడా అట్రాసిటీ కేసు నమోదు కావడం విశేషం.అనిత కూడా ఎస్సీనే అయినప్పటికీ ఆమెపై ఈ కేసు ఎలా పెట్టారన్నది పోలీసులే చెప్పాలి.గతంలో రాజధానిలో కొందరు ఎస్సీలపైనే అట్రాసిటీ కేసు పెట్టి పోలీసులు విమర్శల పాలవడం తెలిసిందే.
అక్రమ కేసులకు భయపడేది లేదు
అరెస్టులు కొత్త కాదని, ఇలాంటి కేసులకు భయపడేదిలేదని ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పష్టం చేశారు. పార్టీ కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు. అంతర్జాతీయ నేరస్థుడిలా వెంటపడి పట్టుకున్నారని మండిపడ్డారు. దేశం విడిచి పారిపోతున్నట్లు వెంబడించి పట్టుకోవడం భావ్యం కాదని బీటెక్ రవి అన్నారు. ఘటన జరిగి రెండు వారాలైంది.. కేసు గోప్యంగా ఉంచారని చెప్పారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపైనా అట్రాసిటీ కేసు పెట్టడం వింతగా ఉందని బీటెక్ రవి తప్పుబట్టారు.