అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ నేతలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ ఆందోళనలను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.పలువురు టిడిపి నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధంలో ఉంచుతోంది.
ఏలూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని గృహ నిర్బంధం చేశారు. ఆందోళనను ఉదృతం చేస్తామని చింతమనేని ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు చింతమనేనిని గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసులు గో బ్యాక్ అంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడిని హౌస్ అరెస్టు చేశారు. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకుని నరసాపురం తీసుకువెళుతున్నట్లు చెప్పారు. అయితే ఆయన్ను చించినాడ మీదుగా తూర్పు గోదావరి తరలించారు. రాష్ట్రంలోని పలువురు నేతలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు పాలకొల్లు ఎమ్మెల్యేను అరెస్టు చేసి బయటకు తీసుకువెళ్లడం చర్చనీయాంశమైంది. కృష్ణాజిల్లా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గృహ నిర్భందం చేశారు.
కాగా టిడిపి నేత నారా లోకేష్ మంగళగిరిలో పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఇసుక కొరత సృష్టించి పేదల పొట్ట కొట్టారని లోకేష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిల ఆధ్వర్యంలో ప్లకార్డులు ధరించి నిరసన, ధర్నా కార్యక్రమాలను కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు.
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ పిలుపునిచ్చిన మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది.