(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: అమరావతి ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురు రైతులను తెనాలి టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. రైతుల అరెస్టును నిరసిస్తూ టిడిపి నేత ఆలపాటి రాజా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఏపి రాజధానిని అమరావతి నుండి తరలించడానికి వీలులేదంటూ 12 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆదివారం వేకువ జామున ఇళ్లల్లో సోదాలు జరిగి ఏడుగురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు, మల్కాపురం గ్రామానికి చెందిన ఇద్దరిని, వెలగపూడి, నెక్కళ్లు గ్రామానికి చెందిన ఒక్కరు చొప్పున పోలీసులు అదుపులోకి తీసుకుని తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల అదుపులో శివబాబు, నరేష్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజు, లోకనాయక్, వెంకట స్వామి ఉన్నారు.
అరెస్టు చేసిన రైతులను తక్షణం విడుదల చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా నేతృత్వంలో అఖిలపక్ష నేతలు తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. రైతులను ఎందుకు అరెస్టు చేశారో పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆలపాటితో సహా అఖిలపక్ష నేతలు స్టేషన్ ముందు దర్నాకు దిగారు.
ఇదిలా ఉండగా నిన్న మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఏడుగురుని అరెస్టు చేసినట్లు డీజిపి గౌతమ్ సవాంగ్ ఆదివారం తెలిపారు. శాంతియుతంగా ఆందోళనలు, ధర్నా, నిరసనలు తెలియజేస్తే ఏటువంటి కేసులు నమోదు చేయమని చెప్పారు. నిన్న ఒక పక్క శాంతియుతంగా మౌన ప్రదర్శన చేస్తుండగా మరో పక్క అక్కడి సమీపంలోనే ఆందోళన చేస్తున్న వారిలో కొందరు దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. నిరసన కార్యక్రమాల్లో కొందరు బయటి వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు.