విజయవాడ,జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆటోనగర్ పార్టీ కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్టులో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందనీ, వ్యయం పెరుగుతుందని కేంద్ర జలశక్తి మంత్రి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా, హైకోర్టు నిర్ణయాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తుందనీ ఉమా విమర్శించారు, వైఎస్ హయాంలో పోలవరం పనులు రద్దు వలన నాలుగేళ్లు ఆలస్యం, 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడిందని అయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆదేశాలతో జరుగుతున్న పనులను వేగవంతం చేయడానికి నవయుగ సంస్థకు అప్పగించారనీ, ఇప్పుడు వైసిపి ప్రభుత్వం వారి సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్టు పనులను ఆపివేసిందని ఉమా అన్నారు. పనుల నిలిపివేతతో 27వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈఎన్సీ వెంకటేశ్వరరావుని తప్పించారనీ , నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర పనిచేసి అందరికీ నచ్చిన ఈఎన్సీని జగన్ కు ఎందుకు చెడ్డగా కనిపిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అయన పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులను చేసినందుకు జగన్ కు బాధగా ఉందా అని ఉమ ప్రశ్నించారు, పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 55,548 కోట్ల రూపాయల అనుమతి సాధించడంలో ఈఎన్సీ విజయం సాధించారని ఉమా చెప్పారు.
ట్రాన్స్ట్రాయ్ కంపెనీ, బెకమ్, నవయుగ సంస్థలు పోలవరం ప్రాజెక్టులో పనిచేసి 70శాతం పూర్తి అయిన తర్వాత జరుగుతున్న పనులు ఆపి జగన్ కోర్టుధిక్కారానికి పాల్పడ్డారని ఉమా విమర్శించారు. జగన్ ప్రభుత్వం తమ తాబేదార్లకు పోలవరం ప్రాజెక్టును కట్టబెట్టడానికి రివర్స్ టెండరింగ్కు వెళ్లారని ఉమా విమర్శించారు. కాంట్రాక్టులను మార్చుకుంటూపోతే పోలవరం ప్రాజెక్టు భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
పోలవరం ప్రాజెక్టు సంబంధించిన 48 గేట్లకు సంబంధించిన పనులు జర్మనీలో జరుగుతున్నాయనీ ఉమా చెప్పారు. దేశ విదేశాల్లో నిపుణుల సమక్షంలో పనులు జరుగుతున్న తరుణంలో రివర్స్కు వెళ్లడం సరికాదని ఉమా హితవు పలికారు. జగన్ మూర్ఖత్వపు, తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్ర ప్రగతి కుంటుపడిందనీ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ ఉమా విమర్శించారు.
టిడిపి ప్రభుత్వం మీద బురదజల్లేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. గత అయిదు సంవత్సరాలలో 55వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ పనులు జరిగాయని ఉమా చెప్పారు.నీటి సంరక్షణలో ఏపి దేశంలో రెండవ స్థానం వస్తే ఒక్కమాట అయిన చెప్పారా అని ఉమా ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు లో పునాదులు లేవని జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో విమర్శించారని గుర్తు చేస్తూ మొన్న లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కాపర్ డ్యామ్ చెక్కు చెదరలేదని ఉమా వివరించారు. పాదాయత్రలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. రాబోయే 1000 రోజులలో ఈ రద్దుల జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని తానే రద్దుచేసుకున్నా ఆశ్చర్యం లేదని ఉమా వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వంద రోజుల జగన్మోహన్రెడ్డి పాలన విధ్వంసం, రివర్స్, రద్దులో కొనసాగిందని విమర్శించారు.,ఒక అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైందని కొల్లు అన్నారు.ఇసుక విధానం ప్రకటించడానికి ఈ ప్రభుత్వానికి మూడు నెలల కాలం పట్టిందని కొల్లు విమర్శించారు.దళారులకు దోచిపెట్టేలా ఇసుకపాలసీ విధానం ఉందని కొల్లు ఆరోపించారు.
రివర్స్ టెండరింగ్, రాజధాని, మచిలీపట్నం పోర్టు విషయంలో రివర్స్ నిర్ణయాలు, అవినీతి అంటూ ఆరోపణలు చేసిన జగన్ ఏ ఒక్క అవినీతిని బయటపెట్టలేకపోయారని కొల్లు అన్నారు. రాజధానిని తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజీలో పెట్టారని కొల్లు విమర్శించారు. 25 మంది ఎంపిలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ అది మర్చిపోయారని కొల్లు అన్నారు.