సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులు సెలక్ట్ కమిటీ పరిధిలో ఉండగా.. మరోసారి అవే బిల్లులను అసెంబ్లీలో పెట్టి ఆమోదించడంపై… టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లులను మళ్లీ ప్రవేశ పెట్టడం.. రాజ్యాంగ వ్యతిరేకమని.. టీడీపీ ఎమ్మెల్సీ వాదిస్తున్నారు.ఈ వ్యవహారంలో హైకోర్టు స్పందన కీలక మలుపులకు దారితీసే అవకాశం ఉంది. ఏపీ సర్కార్ రాజ్యాంగ విరుద్దంగా.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.
ఆ బిల్లులను రద్దు చేయాలని ఆయన కోరుతున్నారు. ఆ బిల్లులు న్యాయపరిశీలనలో నిలబడతాయా లేదా అన్నదానిపై అనేక రకాల విశ్లేషణలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఎందుకంటే… బిల్లులను శాసనమండలి తిరస్కరిస్తే.. వాటిని మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని కానీ.., అటు తిరస్కరించకుండా.. ఇటు ఆమోదించకుండా.. ఇంకా శాసనమండలిలోనే ఉన్న బిల్లులను వెనక్కి తీసుకోకుండా.. మళ్లీ కొత్త బిల్లులుగా శాసనసభలో ప్రవేశ పెట్టడం చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏపీ సర్కార్ అలాంటివేమీ పట్టించుకోకుండా… బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లులను ఆమోదించి..
శాసనమండలిలోనూ ఆమోదించుకునే ప్రయత్నం చేసింది. అయితే.. అక్కడ పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు అక్కడ ఆ బిల్లులు పెండింగ్లో ఉండిపోయినా.. నెల రోజుల తర్వాత ఆమోదం పొందినట్లుగానే భావించడానికి అవసరమైన సాంకేతిక వెసులుబాటు చూసుకున్నారని చెబుతున్నారు. నెల రోజుల తర్వాత ఆ బిల్లు పాసయిపోయినట్లుగా.. భావించి.. గవర్నర్తో నోటిఫికేషన్ ఇప్పించి.. విశాఖకు రాజధానిని తరలిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది. గతంలో ఆ బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయని స్వయంగా ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపున ప్రమాణపత్రం కూడా సమర్పించారు. ఇప్పుడీ అంశం కీలకం కానుంది. ఈ పాయింట్ ని పట్టుకొని టిడి టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. ఉన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.