TDP KCR: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగానే జరిగాయి. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఇటు ఏపిలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. చంద్రబాబు ప్రసంగంలో కొత్త పాయింట్ లు ఉన్నాయి. అచ్చెన్నాయుడు కొంచెం ఘాటుగా వైసీపీపై విమర్శలు చేశారు. నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు..
TDP KCR: కేసిఆర్ పేరు ప్రస్తావించకుండా..
చంద్రబాబు ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 40 శాతం సీట్లు యువతకు ఇస్తామని ప్రకటించారు. అయితే చంద్రబాబు తన ప్రసంగంలో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీ పునః నిర్మాణం, పునరుత్తేజానికి ప్రయత్నిస్తామన్నారు. అదే క్రమంలో ఏపిలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని, వైసీపీని చంద్రబాబుతో సహా నేతలు అందరూ తీవ్రంగా విమర్శించారు. కానీ తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను విమర్శించలేదు. కేసిఆర్ పేరును కూడా ప్రస్తావించలేదు. వాస్తవానికి కేసిఆర్ ను విమర్శించాలంటే చాలానే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై చర్చ జరుగుతోంది. కేసిఆర్ బీజేపీ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న విమర్శ ఉంది. టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేయాలంటే అనేక బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణలో అనేక అంశాలు ఉంటే వాటిపై ఏమీ మాట్లాడకుండా తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తామని అనడంలో ఆంతర్యం ఏమిటి..? కేసిఆర్ అంటే భయమా..? గతంలో ఆయన్ను కెలికి దెబ్బతిన్నామన్న భయమా..? లేదా కేసిఆర్ పట్ల టీడీపీకి ఉన్నది వ్యూహమా..? అనేది తేలాల్సి ఉంది.
TDP KCR: తెలంగాణలో టీడీపీ బలోపేతం కావాలంటే..
తెలంగాణలో టీడీపీ అధికార పక్షంలో లేదు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రతిపక్షంగానే ఉంది. రేపు ఎన్నికల్లోకి వెళ్లి ఎమ్మెల్యేలుగా గెలవాలి అంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేసి ప్రతిపక్షంగా బలమైన వాయిస్ వినిపిస్తేనే అది జరుగుతుంది. సో.. ఇప్పుడు ఆ పని ఎందుకు చేయడం లేదు. ప్రస్తుతం ఏపిలో జనసేన పార్టీ ఎలా ఉందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతకంటే తక్కువగా ప్రస్తుతం ఉంది. గతంలో టీడీపీ తెలంగాణలో బలంగానే ఉండేది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకం అయ్యింది. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పునరుత్తేజం అంటే కేసిఆర్ ను టార్గెట్ చేయాలి..! ఆయన తప్పులను ప్రస్తావించాలి. ఆయనపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా తెలంగాణలో టీడీపీని ఏ విధంగా బలోపేతం చేస్తారు అనేదే ప్రశ్న. వాస్తవానికి కేసిఆర్ విషయంలో చంద్రబాబు గతంలో కొన్ని తప్పులు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇది ఒక మచ్చగా మిగిలిపోయింది. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేసిఅర్ తో కయ్యానికి కాలు దువ్వారు. దాన్ని మనసులో పెట్టుకున్న కేసిఆర్ 2019 ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీయడానికి జగన్ కు ఏ విధంగా సహకరించాల్లో అన్ని విధాలుగా సహకరించారు.
టీడీపీ శ్రేణుల్లో అనుమానాలు
అందుకే ఇప్పుడు కేసిఆర్ తో ఎందుకు కయ్యం అనుకున్నారా..? లేక భవిష్యత్తులో కేసిఆర్ తో అవసరాలు ఉంటాయి అని అనుకున్నారా..? అసలు ఏ వ్యూహం ఉంది. లేదా కేసిఆర్ తో కయ్యం పెట్టుకుంటే 2019 అనుభవం మళ్లీ వస్తుందని భయపడ్డారా..? అనే అనుమానాలు సగటు తెలుగుదేశం కార్యకర్తల్లో ఉంది. టీడీపీ ఒక వ్యూహం ప్రకారం వెళుతోందని కొందరు అంటుండగా, లేదు కేసిఆర్ బలంగా ఉన్నారు కాబట్టి టీడీపీ భయపడింది అని మరి కొందరు అంటున్నారు. టీడీపీలోనే దీనిపై భిన్నమైన చర్చ జరుగుతోంది. అయితే తెలంగాణలో ఒక వ్యూహం ప్రకారమే టీడీపీ వెళుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.