పదవులు లభించకపోవడంతో సీనియర్ తెలుగు మహిళల్లో ఉవ్వెత్తున లేస్తున్న అసంతృప్తితో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా పతనావస్థకు చేరిన తెలుగుదేశం పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు చంద్రబాబునాయుడు ఈ మధ్య కసరత్తు ప్రారంభించారు.టీడీపీ పునరుజ్జీవింపజేసేందుకు ఆయన రకరకాల కమిటీలు కూడా వేసేశారు.గతానికి భిన్నంగా జిల్లాస్థాయి అధ్యక్ష పదవుల స్థానంలో పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ అధ్యక్షులను నియమించారు.అంతేగాక రెండేసి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక సమన్వయ కర్తను కూడా నియమించారు.అలాగే పార్లమెంటరీ స్థాయిలో తెలుగు మహిళ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.ఈ మధ్యే పార్టీ పొలిట్బ్యూరోను,ఏపీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ కమిటీలను జాతీయ టిడిపి కార్యవర్గాన్ని చంద్రబాబు ప్రకటించారు.దీంతో చాలామంది పార్టీవారికి పదవీయోగం పట్టింది.
దీనిపై పురుషపుంగవులు హ్యాపీగానే ఉన్నప్పటికీ అయితే మహిళా నేతలు మాత్రం రుసరుసలాడుతున్నారు.పదవుల పందేరంలో పార్టీలో ఉన్న సీనియర్ తెలుగు మహిళా నాయకురాళ్లు కొందరికి అన్యాయం జరిగిందన్న వాదన తెరపైకి వచ్చింది.మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభాభారతి ఇంతకుముందు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు కాగా ఇప్పుడు ఆ పదవి నుండి తొలగించి జాతీయ కమిటీలో ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.పార్టీ పరంగా చూస్తే పొలిట్బ్యూరో అన్నది అత్యున్నతమైన కమిటీ.అందులో నుండి తనను తొలగించడంతోపాటు తనకంటే చాలా జూనియర్ అయిన వంగలపూడి అనితకు పోలిట్బ్యూరో సభ్యత్వం ఇవ్వడం పట్ల ప్రతిభాభారతి మండిపడుతున్నారట.జాతీయ ఉపాధ్యక్షపదవిని తానేమీ చేసుకోనని ఆమె బహిరంగంగానే పార్టీ వర్గాల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం.పొలిట్ బ్యూరో నుంచి తనను తప్పించడాన్ని ప్రతిభాభారతి తీవ్రంగా పరగణిస్తున్నారని ఆ వర్గాలు చెప్పాయి.
అలాగే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ,శ్రీకాకుళం జిల్లా టిడిపి మాజీ అధ్యక్షురాలు గౌతు శిరీష,మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ,మాజీ మంత్రి పీతల సుజాత తదితరులు కూడా తమకు బాబు అన్యాయం చేశారని వాపోతున్నారు. నిజానికి వీరంతా కూడా టీడీపీకి విశేషమైన సేవలందించిన మహిళానేతలే .అయినా జూనియర్లను అందలమెక్కించి సీనియర్లను పక్కన బెట్టడం బాబుకు తగదని వారు అంటున్నారు.ఈ కొత్త తలనొప్పితో చంద్రబాబు సతమతమైపోతున్నారట.ఏ విధంగా ఈ మహిళా నేతలను సంతృప్తి పర్చాలని ఆయన మధనపడిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.