ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయడంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం అవకాశం దొరికినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆయన టీంను టార్గెట్ చేస్తున్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ దూకుడు చూస్తుంటే వైసీపీ సర్కారులోని ఓ మంత్రిని టార్గెట్ చేసిందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఆయనే ఏపీ రవాణ శాఖ మంత్రి పేర్ని నాని. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, ఉపయోగించిన పదాలు ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు.
జగన్పై సంచలన వ్యాఖ్యలు…
తెలుగు రాష్ట్రాల మధ్య గత కొద్దికాలంగా నిలిచిపోయిన ఆర్టీసీ రవాణా సేవలు తిరిగి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.“అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ సీఎం కేసీఆర్తో చెట్టాపట్టాలేసుకొని తిరిగి, తనను, కేసీఆర్ని చూసి నేర్చుకోవాలని ఉపన్యాసాలిచ్చి, ప్రగతి భవన్కు వెళ్లి మరీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి శాలువాలు కప్పివచ్చిన జగన్ హానీమూన్ పీరియడ్ ముగిసిట్టుంది.“ అని ఎద్దేవా చేశారు. “పక్క రాష్ట్రంతో ముడిపడిన ప్రతి అంశంలో కూడా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి మిగిలారు. అనేక అంశాల్లో స్వరాష్ట్రానికే తీరని అన్యాయం చేసిన జగన్, తెలంగాణకు తిరిగే ఆర్టీసీ బస్సుల విషయంలోకూడా ఏమీ చేయలేకపోవడం దారుణం“ అని పట్టాభిరామ్ ఆరోపించారు.
బస్సులు తిప్పలేని నాని….
దసరా సమయంలో పొరుగు రాష్ట్రానికి బస్సులు కూడా తిప్పలేకపోయారు. ఇప్పుడేమో తెలంగాణతో ఆర్టీసీ బస్సులు తిప్పే అంశంలో చేసుకున్న ఒప్పందం చూస్తే, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయిందని అనిపిస్తోందని పట్టాభిరామ్ ఆరోపించారు. “ రవాణామంత్రి పేర్నినాని తీరికలేకుండా గడుపుతూ, తెలంగాణలో జరిగిన చర్చలకు వెళ్లలేక పోయాడు. రవాణాశాఖ గురించి, ఆర్టీసీ సర్వీసుల గురించి మాట్లాడరు. మీడియా ముందుకొచ్చి, ప్రభుత్వం విధించే అడ్డగోలు జరిమానాలను సమర్థించడం మాత్రం ఆయనకు బాగా తెలుసు.“ అంటూ విరుచుకుపడ్డారు.
పేర్ని నానిపై నిప్పులు…
“రెండు నెలల నుంచీ తెలంగాణతో చర్చిస్తున్నామని చెప్పిన పేర్ని నాని, 371 సర్వీసులకు కోత పెట్టారు. అసలే రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంటే, దాదాపు లక్ష కిలోమీటర్ల వరకు తగ్గించేశారు. మన రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులు గతంలో 2,65,363 కిలోమీటర్లవరకు తెలంగాణలో తిరిగేవి. ఇప్పుడేమో లక్షా 5 వేల కిలోమీటర్ల వరకు మైలేజీ తగ్గించేశారు. మంత్రి హోదాలో హైదరాబాద్ వెళ్లి, తెలంగాణ మంత్రితో చర్చించలేని వ్యక్తి పేర్ని నాని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు“ అంటూ విరుచుకుపడ్డారు.