అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలన ఇదే విధంగా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి టిడిపికి అప్పగించడం ఖాయమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. నర్సీపట్నంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే జగన్ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకోవడంలో రికార్డు సృష్టించారని అన్నారు. ప్రజోపయోగ పాలన చేయకుండా కేవలం చంద్రబాబుపై కక్షసాధించేందుకే జగన్ ఉత్సాహపడుతున్నారని ఆయన విమర్శించారు. వైసిపి పాలనపై ఐపిఎస్, ఐఎఎస్లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న జగన్మోహనరెడ్డి నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేనతో కలిసి పోటీ చేయడం ఖాయమని అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసిపి ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో ఈ నెల నాలుగున నర్సీపట్నంలో రెండు వేల మందితో భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.