ఏపీ సీఐడీ విచారణకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాలయ విజయ్ నేడు హజరు కాలేదు. ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని చింతకాయ విజయ్ నివాసానికి వెళ్లి 41 సీఆర్పీసీ నోటీసును ఆయన పని మనిషికి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు విజయ్ ఏపి సీఐడీ కార్యాలయానికి విచారణకు హజరుకావాల్సి ఉండగా, ఆయన తరపున న్యాయవాదులు ఏపి సీఐడీ కార్యాలయానికి వచ్చి విజయ్ తరపున లేఖ ఇవ్వడానికి ప్రయత్నించగా, వారు నిరాకరించడంతో సీఐడీ కార్యాలయంలోని తపాలా విభాగానికి అందజేశారు.
కేసు ఏమిటో చెప్పకుండా విచారణకు రమ్మంటే ఎలా వెళతామంటూ వ్యాఖ్యానించారు విజయ్. సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులో ఎలాంటి వివరాలు లేవని అన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ, క్రిమినల్ కేసుల వివరాలను సీఐడీ అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు విజయ్. సీఐడీ అధికారులు తన ఇంటిలోకి అక్రమంగా చొరబడ్డారని, తన కుమార్తెను బెదిరించారనీ, తన డ్రైవర్ ను కొట్టారని విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంపై ఇంతకు ముందు చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఖండించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చింతకాయల విజయ్ పై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. విచారణ కు హజరు కాకపోవడంతో ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 41 సీఆర్పీసీ నోటీసు జారీ చేసినా విచారణ కు హజరు కాకపోవడంతో మరో సారి నోటీసు ఇస్తారా లేక అరెస్టు చేస్తారా అనేది చూడాలి మరి.
మరో పక్క విజయ్ చేసిన ఆరోపణలను ఇంతకు ముందే సీఐడీ అధికారులు కొట్టిపారేశారు. ఇంతకు ముందు పలు కేసుల్లో సీఐడీ అధికారులు నిందితులకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేయకుండా రిమాండ్ రిపోర్టు మెజిస్ట్రేట్ కు అందజేస్తే తిరస్కరించిన నేపథ్యంలో ఈ సారి సీఐడీ అధికారులు ముందుజాగ్రత్తగా నోటీసు జారీ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక