అమరావతి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతం వీడి ఇంటికి రాగా బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకుడిపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదైంది. పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి పోలీసులు మరో పది కేసులను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుండి తప్పించుకునేందుకు 12 రోజుల క్రితం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. చింతమనేనిని అరెస్టు చేసేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చింతమనేనిని అరెస్టు చేసి తీసుకువెళుతున్న పోలీస్ వాహనాన్ని గోపన్నపాలెం వద్ద ఆయన అనుచరులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆయన అనుచరులకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంలో చింతమనేని మీడియాతో మాట్లాడుతూ తాను తప్పు చేసినట్లు మంత్రి బొత్సా రుజువు చేస్తే తన ఆస్తి, తన తండ్రి ఆస్తి పేదలకు దానం చేస్తానని ప్రకటించారు. లేకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. తనకు మెజిస్టీరియల్ విచారణ కూడా అవసరంలేదని చింతమనేని అన్నారు. గ్రామ సభ పెట్టి తాను తప్పు చేశాననీ ఎవరైనా అంటే ఏ శిక్షకైనా సిద్ధమని చింతమనేని పేర్కొన్నారు. తాను వస్తున్నానని ముందే చెప్పినా పోలీసులు అరెస్టు చేసేందుకు ఓవరాక్షన్ చేస్తున్నారని చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 పోలీసు బృందాలు పెట్టినా 14 రోజుల పాటు తనను పట్టుకోలేకపోయారని చింతమనేని అన్నారు.