అమరావతి: పోలవరం ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి కంపెనీకి జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్ బస్సుల కాంట్రాక్ట్ అప్పగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కెఇ కృష్ణమూర్తి ఆరోపించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రివర్స్ టెండరింగ్ రాష్ట్రంలో సక్సెస్ అయ్యిందనీ, ప్రభుత్వ ఖజానాకు 58కోట్ల రూపాయలు ఆదా అయ్యిందనీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంపై కెఇ మాట్లాడుతూ అర్హత లేని కంపెనీకి ప్రాజెక్టుని అప్పగించడం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అవుతుందని విమర్శించారు. తమ వర్గానికి చెందిన మెగా క్రిష్ణారెడ్డి కంపెనీకి భారీ ప్రాజెక్టులు నిర్మించే అర్హత లేకున్నా, ప్రాజెక్టును అప్పగించేందుకు జగన్మోహన్ రెడ్డి నిబంధనలు సడలించారని కెఇ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు భద్రతకు పెను ముంపు ఉంటుందని ఆయన హెచ్చరించారు.
రివర్స్ టెండరింగ్ చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ భద్రతకు పాత కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తారా లేక కొత్త కాంట్రాక్టర్ వహిస్తారో ప్రజలకు చెప్పాలని కెఇ డిమాండ్ చేశారు. నాసిరకంగా పనులు చేస్తే ప్రాజెక్టుకు పెనుప్రమాదం పొంచి ఉంటుందని అన్నారు. ఎదైనా జరగరానిది జరిగితే ఉభయ గోదావరి జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయిని కెఇ ఆందోళన వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు ఆలస్యమవుతుందని కెఇ చెప్పారు. పాత కాంట్రాక్టర్ ను కొనసాగించి వుంటే 2020 నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించే వెసులుబాటు వుండేదని కెఇ అన్నారు.
నవయుగను తొలగించి మెగా క్రిష్ణారెడ్డి కంపెనీకి కట్టబెట్టడం వల్ల కనీసం మూడేళ్లు ప్రాజెక్టు ఆలస్యమవుతుందని కెఇ పేర్కొన్నారు.పోలవరంలో కలిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు మెగా క్రిష్ణారెడ్డికి రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఎలక్రికల్ బస్సుల కాంట్రాక్ట్ అప్పగించడానికి రంగం సిద్దమైందని కెఇ ఆరోపించారు. అదే విధంగా 30 వేల కోట్ల రూపాయల విలువ చేసే వాటర్ గ్రిడ్ పనులు కూడా మెగా క్రిష్ణారెడ్డికి అప్పగించేందుకు పథక రచన చేశారని కెఇ విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని కెఇ హితవు పలికారు.
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్న విధంగా మ్యాక్స్ ఇన్ఫ్రా అనే అసమర్ధ కంపెనీకి పోలవరం పనులు అప్పగించారని గతంలో సాక్షి పత్రికలో కథనాలు రాసిన విషయాన్ని కెఇ గుర్తు చేశారు. గతంలో ఇదే కంపెనీపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి నేడు అదే కంపెనీకి ప్రాజెక్టు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలని కెఇ డిమాండ్ చేశారు.
ఐదేళ్లలో 63 శాతం పనులు పూర్తి చేసిన కంపెనీని పక్కన పెట్టి,10 ఏళ్లలో ఎడు శాతం పనులు పూర్తి చేసిన కంపెనీకి అప్పగించడం ద్వారా పోలవరం ప్రాజెక్టును మరో ధన యజ్ణం చేయదలిచారా అని కెఇ ప్రశ్నించారు. డ్యామ్ పనులు. పవర్ ప్రాజెక్టు పనులు వేర్వేరుగా టెండర్లు పిలవకుండా ఒకే టెండర్లో పిలవడంలో ఉద్దేశం ఎమిటని కెఇ ప్రశ్నించారు. రోడ్లు వేసే ఇంజనీర్లకు డ్యామ్ల నిర్మాణం గురించి తెలిసే అవకాశం ఉంటుందా అని కెఇ ప్రశ్నించారు.