రాష్ట్రంలో వైసీపీ రంగుల పంచాయతీ మళ్లీ మొదలు అయ్యింది. ఇంతకు ముందు ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల పంచాయతీ వ్యవహారం అందరికీ తెలిసిందే. గ్రామ సచివాలయాలతో పాఠశాలలకు వైసీపీ జండా రంగులు వేయడం, ఆ వ్యవహారంలో హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో వేసిన రంగులు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా దిశ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుళ్లకు కేటాయించిన స్కూటీలకు వైసీపీ రంగులు వేయడం విమర్శలకు దారి తీస్తున్నది.
దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదిగా స్పందించారు. పోలీసు వాహనాలకు వైసీపీ రంగులా అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం చేస్తున్నారని విమర్శించారు నారా లోకేష్, కొంత మంది పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైసీపీ రంగులోకి మార్చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. రంగులతో మహిళలకు రక్షణ రాదనీ, మూడు రంగుల మదంతో రోడ్డు మీద పడి మహిళలను వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తేనే మహిళలు ధైర్యంగా బయటకు రాగలుగుతారని లోకేష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంలోనే లోకేష్ పోలీసులకు చురకలు అంటిస్తూ అవి వైసీపీ రంగులు కాదు, శాంతికి చిహ్నాలు అంటూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో సమయం వృధా చేయకుండా మహిళలకు భద్రత కల్పించడంపై దృష్టి పెడితే మంచిదని లోకేష్ హితవు పలికారు. నూతన రంగులు దిశ పోలీసులకు పంపిణీ చేస్తున్న ద్విచక్ర వాహనాల వీడియోను లోకేష్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. లోకేష్ చేసిన ఈ విమర్శలపై వైసీపీ శ్రేణులు, పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
పొలిసు వాహనాలకు వైకాపా రంగులా!పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారు.(1/3) pic.twitter.com/m1322e18bV
— Lokesh Nara (@naralokesh) December 21, 2020