అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ (పట్టాభి)ని పోలీసులు గన్నవరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హజరుపర్చారు. గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడ్డడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు టీడీపీ నేతలు ప్రాణహాని కల్గించే ప్రయత్నం చేశారంటూ సీఐ కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఏ 1 గా పట్టాభి, ఏ 2 గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో గన్నవరం పోలీసులు పేర్కొన్నారు. జడ్జి నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించారు.
ఈ సందర్భంలో తను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి అరగంట సేపు కొట్టారని పట్టాభి న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు. పట్టాభి చెప్పిన విషయాలను మెజిస్ట్రేట్ నమోదు చేసుకున్నారు. వైద్య పరీక్షలకు పంపాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ జీజీహెచ్ లో పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో పక్క మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు 11 మంది పై 353, 143, 147, 149 సెక్షన్ కింద అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా వారికి మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.