TDP: దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు తెలియని వారు ఉండరు. అప్పట్లో చంద్రబాబు హయాంలో నిండు అసెంబ్లీలో వైఎస్ జగన్ ని ఆయన తండ్రిని అదే రీతిలో తాత రాజారెడ్డి ని చింతమనేని విమర్శించిన రీతిగా ఏ రాజకీయ నాయకుడు విమర్శించలేదు. ఇంకా అనేక వివాదాస్పద వార్తలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చింతమనేని పేరు మీడియాలో ఎక్కువగా వినిపించేది. మహిళా ఎమ్మార్వో పై చేయి చేసుకోవడంతోపాటు దళితులపై చింతమనేని విమర్శలు చేయటం వంటి వార్తలు అప్పట్లో వచ్చాయి. కాగా తర్వాత 2019 ఎన్నికల్లో చింతమనేని ఓడిపోవడం తో పాటు జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన పై ఉన్న కేసులు బయటకు తీసుకు వచ్చి దాదాపు 60 రోజులకు పైగానే చింతమనేని ప్రభాకర్ ని అరెస్ట్ చేయటం జైల్లో పెట్టడం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయంలోకి వెళితే పెట్రో నిరసనల కార్యక్రమంలో దెందులూరు పోలీసులతో చింతమనేని ప్రభాకర్ వాగ్వాదానికి దిగడంతో.. ఆయనపై కేసు నమోదు అయినట్లు టాక్. ఈ క్రమంలో ఓ వివాహానికి విశాఖ పట్టణానికి వెళుతూ ఉండగా విశాఖ జిల్లా చింతపల్లి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం.. గంజాయి అక్రమ రవాణా జరిగే దగ్గర చింతమనేని మరియు ఆయన అనుచరులు అనుమానాస్పదంగా తిరగడంతో విశాఖ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ముందుగా దెందులూరు పోలీసులు నిరసన కార్యక్రమానికి సంబంధించి కేసు నమోదు చేయడంతో విశాఖ నుండి చింతమనేని ప్రభాకర్ ని ఏలూరు మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లడానికి.. న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ నీ ఖండిస్తున్నారు. కావాలని జగన్ ప్రభుత్వం చింతమనేని నీ టార్గెట్ చేసి ఇబ్బందుల పాలు చేస్తుంది అని టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారు. అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులను వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేస్తున్నట్లు.. మండిపడుతున్నారు.