TDP: కృష్ణాజిల్లా గుడివాడలో టిడిపి వైసిపి పోటాపోటీ ప్రదర్శనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒకవైపు టిడిపి నిజ నిర్ధారణ కమిటీ పర్యటన, మరోవైపు వైసిపి నేతల పోటీ ప్రదర్శనతో ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి బందోబస్తు చర్యలు చేపట్టినప్పటికీ పోటాపోటీ నినాదాలతో గుడివాడ హోరెత్తింది..
మంత్రి కొడాలి నాని కి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని టిడిపి ఆరోపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కే కన్వెన్షన్ సెంటర్ లో గోవా తరహాలో క్యాసినో , పేకాట, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగాయని టిడిపి ఆరోపిస్తోంది. కే కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన జూధ క్రీడలపై పరిశీలన జరిపేందుకు టిడిపి నిజ నిర్ధారణ కమిటీ గుడివాడ చేరుకుంది. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్వంలో వర్ల రామయ్య, బోండా ఉమా తదితర టిడిపి నేతలు గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్ కు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు..
వైసిపి టిడిపి శ్రేణులు ఎదురెదురు పడటం తో పోటాపోటీగా నినాదాలు, సవాళ్లు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను నిలువరించారు. ఈ ఘర్షణ నేపద్యంలో కొందరు టిడిపి నేత బోండా ఉమ కారుపై రాళ్లు విసరడంతో అద్దాలు తగిలాయి. కే కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ టిడిపి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల చర్యలు టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు.