ఏపీలో హాట్ టాపిక్గా మారిన మూడు రాజధానుల వికేంద్రీకరణ విషయంలో కీలక పరిణామం నేడు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖలో ఈనెల 16 వ
తేదీన మొదట శంకుస్థాపన చేయాలని భావించినా… ఆ కార్యక్రమం వాయిదా పడింది. దసరా సమయంలో శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే, రాజధాని తరలింపు మాత్రం పక్కా. అయితే, ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ స్టాండ్ ఏంటనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. ఆ పార్టీ నేతల కామెంట్లే…చంద్రబాబు స్టాండ్ను, ఆయన పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నారు.
అమరావతి తరలింపును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఓ రేంజ్లో తీవ్రంగా తప్పు పడుతున్నారు. పార్టీ నేతలు సైతం ఆయన్ను అనుసరిస్తున్నారు. అయితే అది పూర్తి స్థాయిలో కాదు. అన్యమస్కంగానే అనుకునే పరిస్థితి ఉంది. దానికి నిదర్శనం ఇటీవల రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు. “ఉత్తరాంధ్రలో కీలకమైన విజయనగరం, విశాఖల్లోనే పార్టీ దెబ్బతింది. ఇలాంటి సమయంలో ఉత్తరాంధ్రపై మా వైఖరి ఇప్పటికైనా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. తీవ్రంగా నష్టపోతాం. ఈ విషయాలు మా పార్టీ అధినేత చంద్రబాబుకు తెలియనివి కాదు.`అంటూ పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేసేశారు.
రాజధాని వికేంద్రీకరణ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉన్నప్పటికీ నేతల్లో మాత్రం చీలిక వచ్చిందంటున్నారు. రాయలసీమ నేతలు వికేంద్రీకరణకే జై కొడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు బహిరంగా ప్రకటనలు చేశారు కూడా. సీమలో ఇప్పటికే పలుచనైన పార్టీ సత్తా తాజాగా టీడీపీ అధినాయకత్వం వైఖరితో మరింత క్షీణిస్తోందని అంటున్నారు.మరోవైపు ఉత్తరాంధ్రకు రాజధాని విషయంలో ప్రభుత్వం తీరును కొందరు టీడీపీ నేతలు లోలోపల సమర్థిస్తున్నారు.
ఏకంగా సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అధికార పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. అంటే పార్టీ వైఖరికి కట్టుబడి ఉండే నేతల శాతం ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా ప్రత్యర్థి పార్టీని వ్యతిరేకించడం అనే కోణంలోనే ముందుకు సాగితే రాబోయే కాలంలో సమస్యలు తప్పవని విశ్లేషిస్తున్నారు. ఇదేనా చంద్రబాబు చెప్పుకొనే దేశంలోనే సీనియర్ రాజకీయన నాయకుడిని అనే చాణక్యం అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.