ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయటంపై టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టులో ఉన్న వ్యక్తిని బదిలీ చేయటంపై టిడిపి నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి వివరణ కోరారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున, కోర్టుకే వివరణ ఇస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా నేతలకు స్పష్టం చేశారు. పోలీసు అధికారుల బదిలీపై టిడిపి నేతలు సిఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, జూపూడి ప్రభాకర్ బుధవారం సునీల్ అరోరాతో భేటీ అయ్యారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఇంటెలిజెన్స్ డిజిని బదిలీ చేయటం దేశ చరిత్రలో ఇప్పటివరకూ జరగలేదు. ఎన్నికలతో ఇంటెలిజెన్స్ డిజికి సంబంధం లేదు. ఆయన లా అండ్ ఆర్డర్ చూసుకునే పదవిలో లేరు. కేవలం ముఖ్యమంత్రి రక్షణ మాత్రమే చూసుకుంటురు. ఆయన్ని ఎందుకు బదిలీ చేశారు’ అని ఎన్నికల సంఘాన్ని వివరణ కోరేందుకు కలిశామని నేతలు చెప్పారు. బదిలీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను ఎన్నికల సంఘానికి అందజేశామని తెలిపారు.
వైసిపి ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్నికల సంఘం బదిలీ చేయటం సరికాదని నేతలు పేర్కొన్నారు. ఎటువంటి విచారణ చేయకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఎన్నికల సంఘాన్ని అడిగామని వారు తెలిపారు.
అధికారులను బదిలీ చేస్తారని విజయసాయిరెడ్డి ముందే చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
25 న ఫిర్యాదు చేస్తామనీ, 26 న బదిలీ చేస్తారనీ విజయసాయిరెడ్డి చెప్పారు. దానికి తగ్గట్లే ఎన్నికల సంఘం బదిలీలు చేసింది. దీనివల్ల ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాలు కలుగుతున్నాయని సునీల్ అరోరాకు తెలియజేశామన్నారు.
అలాగే ఎన్నికల సంఘం పరిధిలోకి ఎవరొస్తారో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందనీ, ఈ ఉత్తర్వుల మేరకు ఇంటెలిజెన్స్ డిజి ఎన్నికల సంఘం పరిధిలోకి రారనీ సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లామన్నారు.
తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సునీల్ అరోరాని కోరామని తెలిపారు. అదేవిధంగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలను వాయిదా వేయాలని కోరినట్టు చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ చిత్రం విడుదలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని ఒక వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు.