అమరావతి: మీడియాకు సంకెళ్లు వేసి వైసిపి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జివో 2430 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. 2430 జివో తీసుకువచ్చి మీడియాను బెదిరించడం దుర్మార్గమనీ, అసెంబ్లీకి రానీయకుండా ఆంక్షలు విధించడం అన్యాయమనీ చంద్రబాబు అన్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. పత్రికా స్వేచ్చను కాపాడే వరకూ పోరాటం సాగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ నిరసనలో నారా లోకేష్, అచ్చెన్నాయుడు, బచ్చుల అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.
previous post