కేంద్ర హోంమంత్రి బిజెపిలో నెంబర్ టూ అమిత్ షాకు చంద్రబాబు ఫోను చేయటాన్ని కూడా టీడీపీ అనుకూల మీడియా ఎందుకంత ప్రముఖంగా ప్రచురించింది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
నిజంగా న్యూస్ వాల్యు పరంగా చూస్తే ఇందులో ఏమీ లేదనే చెప్పాలి. ఈ వార్త చదివిన తర్వాత చంద్రబాబునాయుడు పరిస్ధితి ఇంతగా దిగజారిపోయిందా?అని సానుభూతి వ్యక్తమవుతోంది.ఇలాంటి వార్తలు రాసి టీడీపీ అనుకూల మీడియా పూర్తిగా దిగజారిపోయిందని అందరికీ స్పష్టమైన అభిప్రాయం కలుగుతోంది.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేయటంలో వింత గాని ఆశ్చర్యం కానీ వార్తకానీ ఏమీ లేదు.
ఎందుకంటే గడచిన ఏడాదిన్నరగా నరేంద్ర మోదీ అమిత్ షాతో అపాయిట్మెంట్ కోసం చంద్రబాబు తల్లక్రిందులుగా తపస్సు చేస్తున్నాడు. కనీసం వాళ్ళతో ఫోన్లో మాట్లాడినా అదే మహాభాగ్యమన్నట్లుగా చంద్రబాబు తపించిపోతున్నాడు. అయితే 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నిజస్వరూపమేంటో వీళ్ళిద్దరికీ బాగా అర్ధమైపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తిరిగి తనను నోటికొచ్చినట్లు విమర్శించిన చంద్రబాబుపై మోడికి ఎక్కడ కాలాలో అక్కడ బాగా కాలింది. చంద్రబాబు కర్మకొద్ది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటితో అధికారంలోకి వస్తే కేంద్రంలో రెండోసారి కూడా మోడినే అధికారంలోకి వచ్చాడు. దాంతో అప్పటి నుండి చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.
తనకు వ్యతిరేకంగా మోడి+జగన్ కలిస్తే ఏమవుతుందో అందరికన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. అందుకనే ఏదోరకంగా మోడిని మళ్ళీ ప్రసన్నం చేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అటునుంచి స్పందన శూన్యం .ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితం ఎయిమ్స్ నుండి డిస్చార్జయిన కేంద్ర హోంశాఖ మంత్రి ఇంటికి చేరుకున్నాడు. ఇదే అదునుగా చంద్రబాబు పరామర్శపేరుతో వెంటనే హోంశాఖ మంత్రికి చంద్రబాబు ఫోన్ చేశాడు.కుశల ప్రశ్నలు అడిగారు ఆయన కూడా మర్యాద పూర్వకంగా జవాబిచ్చారు ఇంతే అక్కడ జరిగింది. టీడీపీ అనుకూల మీడియా దీనికింత బిల్డప్ ఇస్తున్న దేమిటి ?ఇక పొరపాటున అమిత్ షానే చంద్రబాబుకు ఏదో విషయమై ఫోన్ చేసి ఉంటే టీడీపీ అనుకూల మీడియా ప్రచారం ఏ విధంగా వుంటుందని ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది!