అమరావతి: ప్రజల పక్షాన పోరాడుతుంటే తమ గొంతు నొక్కుతున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.సస్సెన్షన్కు గురైన టిడిపి సభ్యులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలు అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. శాసనసభను వాళ్లు సొంత సభగా నడుపుతున్నారని వారు ఆరోపించారు. వైసిపి ఇచ్చిన క్లిప్పింగ్స్ సభలో చూపిస్తున్నారనీ, తాము ఇచ్చిన వాటిని చూపించడం లేదని వారు పేర్కొన్నారు. నిరసన తెలిపి వాకౌట్ చేస్తామని స్పీకర్కు చెబితే తమను ఏకంగా సస్పెండ్ చేశారని వారు వాపోయారు.
వైసిపి ఎమ్మెల్యేలను సిఎం జగన్ కూడా నిలువరించలేకపోతున్నారని బుచ్చయ్యచౌదరి విమర్శించారు. కడప ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకురావద్దని బుచ్చయ్య చౌదరి సూచించారు.
టిడిపి శాససనభ ఉప నాయకుడిగా వివిధ అంశాలలో గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే తనను సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు అరోపించారు. తన స్థానం నుండి కదల్లేదనీ, అసభ్యంగా మాట్లాడలేదనీ అలాంటి తనను కావాలనే సస్పెండ్ చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.