అమరావతి: మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఏపి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని తన ఫిర్యాదుతోనే మొదలు పెట్టాలని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారనీ, అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని అన్నారు.మద్య నియంత్రణపై తాను సభలో మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసత్యప్రచారం చేస్తున్నవారిలో వైసిపి కార్యకర్తలూ ఉన్నారని హోంమంత్రికి తెలిపారు. దిశ చట్టాన్ని తనతోనే మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని భవానీ కోరారు. ప్రజాప్రతినిధి అయిన తనకే ఇలాంటి పరిస్థితి ఉందంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఆదిరెడ్డి భవానీ దివంగత టిడిపి సీనియర్ నేత కింజరపు ఎర్రంనాయుడు కుమార్తె. ఆమె టిడిపి నేత ఆదిరెడ్డి అప్పారావు తనయుడిని వివాహం చేసుకున్నారు. రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండి భవానీ పోటీ చేసి గెలిచారు.