(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మద్దతు పలికారు. శనివారం రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో కలిసి ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. గణేష్ కుమారులు వాసుపల్లి సాకేత్, వాసుపల్లి సూర్యలకు వైసీపీ అధినేత. సీఎం జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ వైసీపీకి దగ్గర కావడం ఆనందంగా ఉందన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్ అని గణేష్ అభివర్ణించారు. జగన్ ధైర్యమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు గణేష్, టీడీపీకి రాష్ట్రంలో మంచి రోజులు వస్తాయనే నమ్మకం లేదన్నారు. విశాఖకు పరిపాలనా రాజధాని ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందన్నారు. తన నియోజకవర్గంలో అనేక పనులు చేయాల్సి ఉందనీ, అవన్నీ ముఖ్యమంత్రి సహకారంతోనే సాధ్యమవుతుందన్నారు. విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కైవశం చేసుకుని జగన్ కు గిఫ్ట్ గా ఇస్తామని పేర్కొన్నారు గణేష్.
విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుటుంబ సభ్యులు వైసీపీలోకి రావడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. విశాఖలో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు.