అమరావతి: విజయవాడ ఎపి కేశినేని నాని చేసిన వ్యంగ్యాస్త్రంపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ట్విట్టర్ వేదికగా కేశినేని చేసిన వివాదాస్పద వ్యాఖ్య నారా లోకేష్ను ఉద్దేశించి అని కొందరు పేర్కొనగా, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న బుద్దా వెంకన్నను ఉద్దేశించి అంటూ మరో ప్రచారం జరిగింది.
దీనిపై బుద్దా కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. బుద్దా కూడా ఎవరి పేరు ప్రస్థావించకుండా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘సంక్షోభ సమయంలో పార్టీ కోసం, నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి..ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం, నీలా అవకాశవాదులు కాదు, చనిపోయే వరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడే వారు కావాలి’ అంటూ ట్విట్ చేశారు.
దీనిపై కేశినేని మరో ట్వీట్ వదిలారు.
‘నిన్నటి దాకా చంద్రబాబు కాళ్ళు, రేపటి నుండి విజయసాయిరెడ్డి కాళ్ళు, కాళ్ళు కాళ్ళే వ్యక్తులు మాత్రమే తేడా!!!’ అంటూ నాని ట్వీట్ చేశారు. దీనిపై మరల స్పందించిన బుద్దా కేశినేనిపై తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయ జన్మనిస్తే ఆయన్ను అనరాని మాటలనీ, ఆ పార్టీనే కూల్చేశావని బుద్దా విమర్శించారు. చంద్రబాబు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ ఆయన గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు అంటూ బుద్దా దుయ్యబట్టారు. విజయసాయి రెడ్డి మీద ఎవరు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసునని బుద్దా అన్నారు. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవని బుద్దా పేర్కొన్నారు.
విపక్షానికే చెందిన ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా పరోక్ష పద్ధతిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం రాజకీయ నేతల్లో చర్చనీయాంశమవుతోంది.