అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబును అంత మొందించేందుకు వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో వైసిపిప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చంద్రబాబును టార్గెట్గా చేసుకొని ఆయన ఇంటి వద్ద మంత్రులే రెక్కీ నిర్వహిస్తున్నారని బుద్దా ఆరోపించారు. వారి కుట్రలు, కుతంత్రాలు ఇలానే కొనసాగిస్తే ఇక్కడి ప్రభుత్వ పరిస్థితి దేశ వ్యాప్తంగా తెలిసేందుకు తాను సిఎం జగన్మోహనరెడ్డి ఇంటి ముందే ప్రాణత్యాగానికి సిద్ధమవుతానని బుద్దా హెచ్చరించారు.
వైసిపి మాదిరిగా చంద్రబాబు వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే ఉండేది కాదనీ, కానీ ఆయన నైజం అటువంటిది కాదని బుద్దా పేర్కొన్నారు. జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా టిడిపి ప్రభుత్వం ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం జరిగిందని బుద్దా గుర్తు చేశారు. ఆయన పాదయాత్ర సమయంలోనూ పటిష్ట భద్రతను ప్రభుత్వం కల్పించిందని బుద్దా చెప్పుకొచ్చారు.
వరదను అడ్డం పెట్టుకొని డ్రోన్తో చంద్రబాబు నివాసం వద్ద రెక్కీ నిర్వహించారని ఆయన ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చంద్రబాబును టార్గెట్గా వ్యవహరిస్తున్నట్లు కనబడుతోందనీ, అందులో భాగంగానే చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించారని బుద్దా అన్నారు. సెక్యూరిటీ విషయంపై హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని బుద్దా గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశించినా ఇంత వరకూ భద్రత పెంచలేదని బుద్దా అన్నారు. జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత కల్గి ఉన్న నేత ఇంటి పరిసరాలు హై సెక్యూరిటీ జోన్ పరిధికి వస్తుందనీ, ఆ ప్రాంతంలో డ్రోన్ వినియోగించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి ఉంటుందని బుద్దా అన్నారు. అటువంటిది ఏమీ లేకుండా డ్రోన్ వినియోగించారంటే ఆయన్ను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించినట్లుగానే భావించాల్సి ఉంటుందని బుద్దా ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని బుద్దా పేర్కొన్నారు.
ఇక్కడి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని బుద్దా అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబును ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని బుద్దా పేర్కొన్నారు. చంద్రబాబు భద్రత విషయంపై ప్రధాని మోది, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్షాకు లేఖలు రాయనున్నట్లు బుద్దా తెలిపారు.