అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్వట్టర్ వేదిగా టిడిపి, వైసిపి నేతల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసిపి నుండి 23మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలనూ అక్రమంగా టిడిపి తీసుకుంటే భగవంతుడు వారికి అవే వచ్చే విధంగా స్క్రిప్ట్ రాశాడంటూ పలు మార్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై నారా లోకేష్ దేవుడి స్క్రిప్ట్ పేరుతోనే నేడు జగన్మోహనరెడ్డిపై విమర్శలు సంధించారు.
దేవుడి స్క్రిప్ట్లో ట్విస్ట్లూ ఉంటాయని జగన్కు లోకేష్ సూచిస్తూ ‘దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు.
రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది పుల్స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు’ అంటూ విమర్శించారు.
దేవుడు కామా తరువాత మళ్లీ స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టారని లోకేష్ అన్నారు. మీరు అవనీతి అన్న పట్టిసీమ మోటర్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఒకే చేయించాడు అని లోకేష్ పేర్కొన్నారు. టిడిపి హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అకమం అని మీరంటే..అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్క్రిప్ట్లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయని లోకేష్ పేర్కొన్నారు.
‘భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్రటేరియట్లో సిఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుకి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో అని స్క్రిప్ట్లో మళ్లీ కామా పెట్టాడు’ అని లోకేష్ అన్నారు.