అమరావతి: టిడిపిపై కక్షసాధింపు చర్యలను వైసిపి ప్రభుత్వం మానుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు హితవుపలికారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రతి నేరాన్ని, ఘోరాన్ని ప్రజల ముందు పెడతామని అన్నారు. టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులను తవ్వుతున్నారనీ, మరి వైసిపి నేతలపై ఉన్న కేసులనూ రీఓపెన్ చేస్తారా అని యనమల ప్రశ్నించారు.
వంద రోజుల వైసిపి పాలనపై తాము విడుదల చేసిన కరపత్రంలో అన్నీ వాస్తవాలేనని యనమల పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెడతామని యనమల చెప్పారు. వైసిపి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ అంటూ నాణ్యతలేని బియ్యం సరఫరా చేశారని యనమల ఆరోపించారు.
మంత్రి బొత్సా సత్యనారాయణ పరిశ్రమలు ఎక్కడికీ పోలేదని చెబుతుండటం హాస్యాస్పదమని యనమల వ్యాఖ్యానించారు.