(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని గుంటూరు టీడీపీ పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు గల్లా జయదేవ్..కేంద్ర ఆహార, ప్రజా సరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలోనే రూ.700కోట్ల వరకూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని గల్లా ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రస్తుతం నెల్లూరులో ధాన్యం సేకరణ, కొనుగోళ్ల విషయంపై వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు యుద్ధం నడుస్తోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ఇప్పటికే ఈ ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఆరోపణలు రుజువు చేయాలంటూ సవాల్ విసిరారు. అయితే ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారుల వద్దకు వచ్చిన ఫిర్యాదులపై విచారణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపి గల్లా జయదేవ్..సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకోంది.