ఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలకై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రధేశ్ భవనం వద్ద ‘ధర్మపోరాట దీక్ష’ చేస్తుండగా టిడిపి ఎంపిలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సోమవారం పార్లమెంట్లో తమ గళం వినిపించారు.
రాష్ట్ర విభజన అంశాలపై టిడిపి ఎంపి కె రామ్మోహన్నాయుడు కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబట్టారు. కేంద్రం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని రామ్మోహన్నాయుడు అన్నారు.
దేశం అంటే మట్టికాదు..దేశం అంటే మనుషులు అన్న విషయాన్ని ప్రధాని మోది గుర్తుంచుకోవాలంటూ ప్రముఖ కవి గురజాడ అప్పారావు రాసిన కవితను రామ్మోహన్నాయుడు వినిపించారు.
రైల్వేజోన్పై ఇప్పటికి కేంద్రం ప్రకటన చేయలేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు అన్ని చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని రామ్మోహన్నాయుడు అన్నారు. తక్షణం ఉత్తరాంధ్ర రీజియన్ రైల్వేజోన్కు గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధాని మోది వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని రామ్మోహన్నాయుడు అన్నారు. ఎపి ప్రజలను దారణంగా మోసం చేశారని రామ్మోహన్నాయుడు విమర్శించారు.
వెనుకబడిన జిల్లాలలకు ఏటా విడుదల చేయాల్సిన నిధులను కూడా విడుదల చేయడం లేదనీ, జిల్లాకు 50కోట్ల రూపాయల చొప్పున 350కోట్లు విడుదల చేసిన నిధులను కూడా వెనక్కు తీసుకున్నారనీ, భారతదేశ చరిత్రలో మంజూరు చేసిన నిధులను వెనక్కు తీసుకున్న దాఖలాలు లేవని రామ్మోహన్నాయుడు అన్నారు.
రాష్టంలో అవినీతి జరుగుతుందని ఏ విధంగా విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదనీ, మంచిగా పని చేయడం వల్లనే రాష్ట్రానికి 600 అవార్డులు వచ్చాయని రామ్మోహన్నాయుడు అన్నారు.
సబ్కా సౌత్..సబ్కా వికాస్ మాటలకే పరిమితం అయ్యిందని పేర్కొన్నారు.
మరో ఎంపి బుట్టా రేణుక మాట్లాడుతూ రాయలసీమలో రెండేళ్లుగా తీవ్ర కరువు ఉందనీ, కరువు ప్రాంతాలకు ప్రత్యేక సాయం ప్రకటించాలని కోరారు. కులవృత్తులు చేసుకునే వారికి బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదని రేణుక అన్నారు. వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులకు సాయం చేయాలని రేణుక కోరారు. రాజధాని అమరావతికి కేంద్రం ఏమి ఇవ్వడం లేదని రేణుక అన్నారు.