ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మండమైన మెజార్టీతో అధికారంలోకి రావడం, అంతలోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం ఎమ్మెల్యేలకు వెల్కం చెప్పడం తెలుగుదేశం పార్టీలు జీర్ణించుకోలేకపోతున్న సంగతి తెలిసిందే.
అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే రీతిలో సైకిల్ పార్టీ స్కెచ్చులు వేస్తోంది. తాజాగా సీఎం జగన్ను టార్గెట్ చేసేందుకు ఉపయోగిస్తున్న అంశం ఏపీ డీజీపీ అని ప్రచారం చేస్తున్నారు.
బాబు ఈగో హర్టయిందా?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ పరిస్థితులను పేర్కొంటూ ఏపీ డీజీపీకి లేఖ రాయడం, దానికి ప్రతిస్పందన ఏపీ డీజీపీ స్పందించి లేఖ రాయడం తెలిసిన సంగతే. అయితే, దీనిపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. చంద్రబాబుకి డీజీపీ రాసిన లేఖను అంతతేలిగ్గా వదిలేది లేదని, దానిపై ఎక్కడికి వెళ్లాలో అక్కడికెళ్లి, రాష్ట్ర పోలీస్ బాస్ సంగతేమిటో తేలుస్తామని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఆనాడు ఏమన్నారు?
ఏపీ పోలీస్ వ్యవస్థపై తనకు నమ్మకం లేదన్న జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతున్న కొందరు పోలీసులు, రాష్ట్ర పోలీస్ డిపార్ట్ మెంట్ సంక్షేమం కోసం ఆత్రుత పడిన చంద్రబాబుపై నిందలు వేయడం ఏంటి? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. “ఎవరి మెప్పు కోసం, ఎవరి కళ్లల్లో ఆనందం చూడటం కోసం డీజీపీ ఇంతలా మితిమీరి ప్రవర్తిస్తున్నాడు? టీడీపీ హాయాంలో ఏనాడైనా దళితులు తమకు రక్షణ లేదని గగ్గోలు పెట్టిన దాఖలా ఉన్నాయా? డీజీపీ, చంద్రబాబుకి రాసిన లేఖ ముమ్మాటికీ అనైతికమైనదే.“ అని వర్ల రామయ్య మండిపడ్డారు. డీజీపీ, చంద్రబాబుకి రాసిన లేఖ అనైతికంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది. రాజ్యాంగం ద్వారా చంద్రబాబుకి సంక్రమించిన హక్కులను హరించేలా డీజీపీ రాసిన లేఖ ఉంది.
రాజకీయాల్లోకి డీజీపీని లాగేశారుగా
`అధికార పార్టీ వారిని కాపాడాలన్న తన తపన, ఆకాంక్ష డీజీపీ లేఖలో స్పష్టంగా కనిపించింది` అని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు సంబంధించి, టీడీపీ తరుపున రాసిన లేఖలపై ఏనాడూ డీజీపీ ఇంతవేగంగా స్పందించలేదు. దళిత యువకులను చంపినా, దళిత బాలికను అత్యంత కిరాతకంగా మూకుమ్మడిగా అత్యాచారం చేసినా, దళిత వైద్యుడిని రోడ్డుపై అర్థనగ్నంగా ఈడ్చుకెళ్లినప్పుడు డీజీపీ ఇసుమంతైనా స్పందించలేదు. అటువంటి వ్యక్తి, తన లేఖద్వారా ప్రజలనోరు నొక్కాలని, ప్రతిపక్ష నాయకుడి నోరు నొక్కాలని ఎందుకు ప్రయత్నించారో సవాంగ్ చెప్పాలి. “ అంటూ ప్రశ్నించారు. కాగా, వైసీపీ మనిషిగా డీజీపీపై ముద్ర వేసేందుకు ప్రయత్నించి ఏపీ సీఎం జగన్ను బుక్ చేసేలా టీడీపీ గేమ్ ప్లాన్ వేస్తోందని అందుకే రాజ్యాంగ, చట్టం అంటూ మాట్లాడుతోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.