ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా జరుగుతున్న ఘటనలు వివాదాదస్పదంగా మారుతున్నాయి. ఉద్దేశపూర్వక చర్య కాదని ప్రభుత్వం క్లారిటీ ఇస్తున్నప్పటికీ, హిందూ మతస్తులు మాత్రం వరుస ఘటనల నేపథ్యంలో కలవరం చెందుతున్నారు.
మరోవైపు కఠిన చర్యలు లేకపోవడం సైతం విపక్షాలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు అవకాశం ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసగా ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పూజలు నిర్వహించాలని డిసైడ్ అయింది.
టీడీపీ కీలక ప్రకటనలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుండి శనివారం వరకు సూర్య దేవాలయాల వద్ద పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు నిమ్మకాయల చిన్న రాజప్ప, గొల్లపల్లి సూర్యారావు కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేవాలయాల్లో ప్రార్థనలు నిర్వహించాలని కోరారు. అంతర్వేదిలో నరసింహస్వామి రధం దగ్దం చేసిన దుండగుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనతకు వ్యతిరేకంగా, ప్రతిపక్షాలపై అక్రమ నిర్బంధాలు, కేసులకు వ్యతిరేకంగా నేడు రాజోలు నియోజకవర్గంలో బందు చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ప్రకటించారు.
కొన్ని రోజులుగా ఇదేం పరిస్థితి?
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు, పూజారులపై దాడులు అనేకం జరుగుతున్నాయని మాజీ మంత్రులు నిమ్మకాయల చిన్న రాజప్ప, గొల్లపల్లి సూర్యారావు ఆందోళన వ్యక్తం చేశారు. గోశాలల్లో గోవుల పోషణ నిర్వహణలో నిర్లక్ష్యం జరుగుతోందని తద్వారా గోవులు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల భూముల కబ్జాను అరికట్టడంలో ప్రభుత్వ వైఫ్యల్యానికి వ్యతిరేకంగా వారం నిరసన కార్యక్రమాలు జరపాలని నిర్ణయించడమైందని వారు వెల్లడించారు. ఇందులో భాగంగా రాబోయే ఆదివారం సూర్యదేవాలయాల వద్ద పూజులు, ప్రార్థనలు సోమవారం శివాలయాల్లో ప్రార్థనలు, మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి గుడులు, బుధవారం అయ్యప్ప గుడుల్లో ప్రార్థనలు ,గురువారం సాయిబాబా మందిరాల్లో, శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో శనివారం విష్ణు ఆలయాల్లో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పూజలు, ప్రార్థనలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాజోలు బందులో పార్టీలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.కాగా, టీడీపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాల పట్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.