టిడిపి నేతలకు చంద్రబాబు కొత్త టెన్షన్ పెట్టారు.ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని వారు తలలు పట్టుకుంటున్నారు.విషయానికి వస్తే అమరావతి ఆందోళనలు ప్రారంభమై సోమవారం నాటికి మూడొందల రోజులవుతున్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు శనివారం నుండి సోమవారం వరకు టిడిపి తరపున పాటించాల్సిన నిరసన కార్యక్రమాల షెడ్యూల్ ని విడుదల చేశారు.చంద్రబాబు షెడ్యూల్ ప్రకారం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నేతలు మీడియా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఎండగట్టాలి. ఆదివారం అమరావతి ఉద్యమకారులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలి. మహాత్మాగాంధి అంబేద్కర్ జ్యోతిరావు పూలె ఎన్టీయార్ విగ్రహాలకు వినతిపత్రాలు అందించాలి. ఆదివారం రాత్రి అందరు స్కై లాంతర్ల ద్వారా తన నిరసన తెలపాలి.
ఇక సోమవారం ఉదయం నియోజకవర్గాల్లోని ఎంఆర్వో కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు దీక్షలు చేయాలని బాబు ఆదేశించారు.ఇంతటితో అధినేత పని అయిపోయింది ఇక ఈ కార్యక్రమాలను అమలు చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉంది. ఇక్కడే వారు బెంబేలెత్తుతున్నారు. శనివారం ప్రెస్ మీట్ అయితే ఏదో విధంగా లాగించేయొచ్చు..కానీ ఆది సోమవారాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలే వారికి ఆందోళన కలిగిస్తున్నాయి.ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయి.ఎపిడమిక్ చట్టాన్ని పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు .అంటే గుంపులు గుంపులుగా ఎవరైనా సరే రోడ్లపైకి వస్తే వెంటనే వారిని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంది .ఇదే చట్టాన్ని ఉపయోగించి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్రెడ్డిని అరెస్టు చేయడం గుర్తుండే ఉంటుంది.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పినట్లు తాము నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లయితే పోలీసులు తప్పకుండా తమను అరెస్టు చేస్తారని వారు భయపడుతున్నారు.అలా అరెస్టయితే తమను బయటకు తెచ్చేదెవరని వారు వాపోతున్నారు.అంతేకాదు అమరావతికి మద్దతుగా రాయలసీమలోనూ విశాఖపట్నంలోనూ ఆందోళనలు చేస్తుంటే అక్కడి వారు ఊరుకుంటారా అన్నది కూడా వారిని వెంటాడుతున్న మరో భయం.దీంతో మింగలేక కక్కలేక టిడిపి నేతలు మధనపడిపోతున్నారు.మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి!