Pegasus: పశ్చిమ బెంగాల్ సీఎం మమత పై తెలుగుదేశం పార్టీ కుతకుతలాడుతోంది.మరోవైపు అమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను తెగ ఆడిపోసుకుంటోంది.
ఫోన్లను దొంగచాటుగా వినే పెగాసన్ సాఫ్ట్ వేర్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన పెగాసన్ కు సంబంధించి చేసిన ఒక వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించింది.
Pegasus: అసెంబ్లీ సాక్షిగా మమత చెప్పిందేమిటంటే?
రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో పెగాసన్ విషయమై చర్చ జరిగింది.దీనికి సీఎం మమతా బెనర్జీ బదులిస్తూ ఇజ్రాయిల్ కు చెందిన ఎస్ఓఎస్ అనే సంస్థ దీనిని తయారుచేసి విక్రయిస్తోందని చెప్పారు.ఆ సాఫ్ట్వేర్ సృష్టికర్తలు పశ్చిమబెంగాల్ పోలీసు శాఖను ఇరవై అయిదు కోట్లకు దానిని విక్రయిస్తామంటూ సంప్రదింపులు జరపగా తాము తిరస్కరించామని మమత చెప్పారు.అదే సమయంలో ఆమె ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసిందని వెల్లడించారు.దీంతో వైసిపి నేతలకు చేతికి పెద్ద ఆయుధం లభించినట్లయింది.అదే సమయంలో టీడీపీ ఆత్మరక్షణలో పడింది.
నాలుక పీక్కున్న నారా లోకేష్!
ఎప్పుడైతే మమతా బెనర్జీ టిడిపిపై ఈ తరహా ఆరోపణలు చేసిందో వెంటనే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ తెరపైకి వచ్చారు.మమత చెప్పినదాంట్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.”మాకు కూడా ఆ కంపెనీ ఆఫర్ చేసిన మాట వాస్తవమే ..అయితే మేము కొనలేదు” అని లోకేష్ చెప్పారు.అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాంటి నీతిబాహ్య చర్య లను ప్రోత్సహించే బాపతు కాదని లోకేష్ పేర్కొన్నారు.ఆ సాఫ్ట్వేర్ తాము కొనుగోలు చేసి ఉంటే జగన్ సీఎం అయ్యేవారు కాదని లోకేష్ వ్యాఖ్యానించారు.ఒకవేళ తాము ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఉంటే జగన్ ప్రభుత్వం ఈపాటికే తమను ఉతికి ఆరేసేదని కూడా ఆయన అన్నారు.
సవాంగ్ కూడా చెప్పిందదే నట!
ఈ సందర్భంలో టిడిపి నేతలుబగతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కార్యాలయం సమాచార హక్కు చట్టం కింద పెగాసన్ కు సంబంధించిన సమాధానాన్ని ప్రస్తావిస్తున్నారు.కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి గత ఏడాది జులైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసిందా అని సమాచార హక్కు చట్టం కింద పోలీసు శాఖను కోరగా డిజిపి కార్యాలయం ఆ సాఫ్ట్వేర్ ను తాము కొనుగోలు చేయలేదని జవాబిచ్చిందని చెబుతున్నారు.డిజిపి కార్యాలయం ఇచ్చిన సమాధానంతో ని దీనిపై స్పష్టత వచ్చిందని,ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని టిడిపి నేతలు అన్నారు.
ప్రశాంత్ కిశోర్ వైపు మళ్లిన వేళ్ళు!
కాగా మమతా బెనర్జీ టీడీపీ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక ఆమె రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బ్రీఫింగ్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.గతంలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ అనేక టక్కుటమార విద్యలు ప్రదర్శించి జగన్ ను సీఎం చేయగలిగారని వారు అంటున్నారు.అదే తరహా వ్యూహాలు పశ్చిమ బెంగాల్లో కూడా అమలు చేసి మమతా బెనర్జీకి తిరిగి అధికారం దక్కేలా చేశారన్నారు.దుష్ప్రచారం ద్వారా ప్రత్యర్థుల పై బురదజల్లేది ప్రశాంత్ కిషోర్ వ్యూహమని వారు అన్నారు.ప్రశాంత్ కిశోర్ ద్వారానే మమతా బెనర్జీకి కూడా టిడిపి పై తప్పుడు సమాచారం అందిందని,అదే ఆమె వెల్లడించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు.అయితే ఇలాంటి దుమారం వల్ల టిడిపికి నష్టమేమీ లేదని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.