TDP తిరుపతి ఎంపీ స్థానం ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారయింది. అభ్యర్థులు సిద్ధమయ్యారు. నామినేషన్లు కూడా వేసుకుంటున్నారు. వైసీపీ ధీమాగా ఉంటూ ఆధిక్యత లెక్కలు వేసుకుంటుండగా.., బీజేపీ – జనసేన పెరిగిన బలాన్ని చుపించాలనుకుంటున్నాయి. టీడీపీ మాత్రం తమ బలం తగ్గకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతుంది. మొత్తానికి ఇక్కడ విజేత ఫిక్స్. కాకపోతే ఎవరికీ ఎన్ని ఓట్లు, ఎవరి బలం ఎంత అనేదే తేలాల్సి ఉంది. ఇతర పార్టీల సంగతి పక్కన పెట్టి టీడీపీ మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పోటీలో దిగుతుంది..!
పోటీలో లేకుండా ఉంటే.. మంచి అవకాశమే..!!
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీ బలీయమైన శక్తిగా ఉంది. టీడీపీ తమ పాత శక్తిని పోగు చేసుకునే పనిలో ఉంది. బీజేపీ ఉనికి కోసం తాపత్రయ పడుతుంది. జనసేన ప్రభావం చూపాలనుకుంటుంది..! నిజానికి ఈ మూడు పార్టీలు శత్రువులు అయితే… ఒకరిని ఓడించడానికి మరో ఇద్దరు కలిసినా తప్పు లేదు. బీజేపీకి ఉన్న అవసరాల దృష్ట్యా…, తిరుపతి ఎంపీ స్థానంలో వైసిపిని ఓడించాలి అనుకుంటే టీడీపీ మద్దతు తీసుకోవచ్చు. టీడీపీ – జనసేన – బీజేపీ కలిపి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించి గెలుపు ప్రయత్నాలు చేయవచ్చు.
అదే జరిగితే వైసిపికి కష్టమైన ఎన్నిక అయ్యేది. కానీ.. ఎవరికీ వారు విడిగా పోటీ కారణంగా ఈ మూడు (టీడీపీ, జనసేన, బీజేపీ)లకు వచ్చే ప్రాధాన్యత ఏమి లేదు. పైగా చంద్రబాబుకి మనసులో బీజేపీతో కలవాలి.., జనసేనతో కలవాలి అనే ఉంటుంది. వైసిపిని ఒంటరిగా ఢీకొనడం కష్టమని బాగా తెలుసు. అందుకే తిరుపతి ఉప ఎన్నికలు వేదికగా చేసుకుని బీజేపీతో స్నేహం చేస్తే.. వాళ్ళు అంగీకరించకపోయినా టీడీపీ ఓట్లు అటు డైవర్ట్ చేస్తే టీడీపీ పరిస్థితి మరోలా ఉండేది.
TDP ఫలితం దారుణంగా ఉంటే..!? పరువో..? నమ్మకమో..!?
“టీడీపీ కచ్చితంగా పోటీ చేయాల్సిందే.. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోతే ఎలా..!? పార్టీ శ్రేణుల్లో నమ్మకం పోతుంది. పార్టీపై మచ్చ వచ్చేస్తుంది” అని ఆలోచించిన వారు ఉన్నారు. పోటీ చేస్తే వచ్చే తక్కువ ఓట్లు కంటే.. పోటీ చేయకుండా బీజేపీకి మద్దతివ్వడం వలన వచ్చే ప్రయోజనం అధికంగా ఉండేది. ఇప్పుడు టీడీపీకి పరువు సమస్యగా మారింది. 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ పరిధిలో టీడీపీకి 4 . 94 లక్షల ఓట్లు వచ్చాయి.
ఇప్పుడు అదే సంఖ్యలో ఓట్లు వస్తే పార్టీకి కొంచెం పరువు, ప్రతిష్ట, నమ్మకం నిలబడతాయి. అలా కాకుండా టీడీపీకి వచ్చే ఓట్లు కేవలం 3 లక్షలకు.., అంత కంటే తక్కువకు పరిమితం అయితే మాత్రం టీడీపీలో ఎన్నడూ లేని దారుణమైన అపనమ్మకం ఏర్పడుతుంది. అభద్రతా ఆవహిస్తుంది. ఈ అపనమ్మకం, భద్రతలు రాకుండా ఉండేందుకు.., కొంచెమైనా పరువు నిలుకునేందుకు చంద్రబాబు బీజేపీ అభ్యర్ధికి మద్దతుగా ఉంటూ గెలిపించే బాధ్యత భుజాన వేసుకోవాల్సింది. అదే జరిగితే తమ్ముళ్లకు నమ్మకం కుదిరేది. గెలిపించారన్న పేరు దక్కేది..!!