Nara Lokesh: “అతనొక్కడే “అంటూ ఒక టిడిపి ఎమ్మెల్యే కీర్తించగా,ఆయన చిత్రపటానికి విజయవాడలో విద్యార్థులు పాలాభిషేకాలు చేసి జిందాబాద్ లు కొట్టారు.ఇంతకీ ఆయన ఎవరంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు!ఆయన సాధించిన విజయం ఏమిటంటే ఏపీలో పది,ఇంటర్ పరీక్షలు రద్దు చేయించడమట.వినడానికే ఇది విచిత్రంగా ఉంది కదా!ఇది ఏ విధంగా లోకేష్ విజయమో అర్థం కాని పరిస్థితి నెలకొంది.ఆయన ఈ పరీక్షల రద్దు కోసం డిమాండ్ చేసిన విషయం వాస్తవం.విద్యార్థులను,వారి తల్లిదండ్రులను కూడా కొద్దిగా జూమ్ కాన్ఫరెన్సుల్లో చైతన్యపరిచారు.అంతటితో ఆయన పాత్ర ముగిసింది.విషయం కోర్టు వరకు వెళ్లింది.కోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దు చేసింది.ఇందులో లోకేశ్ గొప్పతనం ఏమిటనేది ఇక్కడ జవాబు దొరకని ప్రశ్న.
అసలేం జరిగిందంటే!
విద్యార్థుల భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఎలాగైనా పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని తలపెట్టింది.ఈ రెండు పరీక్షలే భవిష్యత్తులో విద్యార్ధుల కెరీర్ కి సోపానాలు కాబట్టి ఆ పరీక్షలు నిర్వహించటానికి తాపత్రయపడింది.ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అందుకనుగుణంగా వాటిని వాయిదా వేస్తూ వస్తోంది.ఈలోపు విషయం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది.ఈ దశలో సుప్రీంకోర్టు జులై 31లోగా పరీక్షలు ముగించి, ఫలితాలు ప్రకటించాలని, అలా చేయగలిగితేనే వచ్చే విద్యా సంవత్సరం విషయంలో అన్ని రాష్ట్రాల్లోనూ సారూప్యత ఉంటుందని సూచించింది.అయితే సుప్రీంకోర్టు విధించిన జూలై 31 డెడ్ లైన్ లోగా పరీక్షల నిర్వహణ సాధ్యపడదన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ ప్రభుత్వం పదో తరగతి,ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.దీన్నిబట్టి ఎవరికైనా ఆర్ధమౌతున్నదేమిటంటే కేవలం సుప్రీంకోర్టు కోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకుని, వాటిని అధ్యయనం చేసి,సాధ్యాసాధ్యాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల రద్దు వంటి కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో మరెవరి ప్రమేయం లేదు.
ఇదెలా లోకేష్ విజయమబ్బా?
కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇది లోకేష్ విజయమన్నట్లుగా ప్రచార దుందుభి మోగిస్తోంది.కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా సెలబ్రేషన్సు జరుపుకొంటోంది.ఎమ్మెల్యేలు లోకేష్ ను కీర్తిస్తూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం,టిడిపి స్పాన్సర్డ్ విద్యార్ధులు లోకేశ్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేయడం వంటివి రాష్ట్రంలో శుక్రవారం జరిగాయి.ఇంకా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును లోకేషే ఇచ్చినట్లుగా టిడిపి వర్గాలు సంబరపడుతుండడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.