చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు… ఆయన ప్రకటించిన రూ. 50వేల సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. దీంతో విశాఖలో టీడీపీ నేతలు ప్రకటనలతో హడావిడి చేస్తున్నారు! అవును… ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ లీకేజ్ ఘటన బాధితులకు మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన రూ. 50వేల సాయం అసెంబ్లీ కార్యక్రమాల రోజున అందించనున్నారు. ఈ సమయంలో బాబు విశాఖకు వెళ్లకపోవడానికీ గల కారణాలు ఏమిటి.. ఈ రూ. 50వేల సాయాన్ని బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం ఎందుకు వంటి విషయాలపై క్లారిటీ ఇస్తూ… మృతుల కుటుంబాలకు లేఖలు రాశారు.
“నాకు ఎంతో ఇష్టమైన విశాఖ నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. విషవాయువు వల్ల 15మంది మృతి చెందడం మనసును కలిచివేసింది. మిమ్మల్ని పరామర్శించడానికి విశాఖకు బయలుదేరిన రోజు ప్రభుత్వం విమాన సర్వీసులను రద్దు చేసింది. లేదంటే… నేరుగా వచ్చి ఇచ్చేవాడిని! తెదేపా తరుపున రూ. 50వేల సాయాన్ని మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నాను. మీకు జరిగిన నష్టం భరించలేనిది. అయినా గుండె దిటవు చేసుకుని భవిష్యత్తువైపు ముందడుగు వేయాలి.” అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయాలపై విశాఖ వైకాపా నాయకులు స్పందించారు. ఆ యాభైవేల రూపాయలు వెయ్యడానికి ఇంతకాలం పట్టిందా.. లేక, అసెంబ్లీ సమావేశాలు వచ్చేసరికి ఉన్నపలంగా గుర్తుకు వచ్చిందా.. అని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ రూ. కోటి ప్రకటిస్తే… ఎవరు అడిగారు మిమ్మల్ని కోటి రూపాయలు.. కోటి ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగివస్తాయా.. అని బాబు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు. కోటితో రాని ప్రాణాలు ఏభైవేలతో వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు! ఏది ఏమైనా… అసెంబ్లీ సమావేశాల సమయంలో బాబు విశాఖ బాధితుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లే!