గత కొద్దికాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూమతం కేంద్రంగా జరుగుతున్న ఘటనల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది.
వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల హిందూ ధార్మిక సంస్థలపై, హిందూమతంపై, దేవాలయాలపై దాడులు, మతమార్పిడులు రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగాయని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే హిందువుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఆలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
జగన్ సర్కారుపై సంచలన విమర్శలు
గత ఏడాది నెల్లూరులోని బిట్రగుంట వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథం దగ్ధమైందని, ఆనాడే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే, నేడు అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమయ్యేది కాదని ఉమా మహేశ్వరరావు తెలిపారు. పరమ పవిత్రమైన తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తూ, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అన్యమతస్తులను టీటీడీలో ఉద్యోగులుగా నియమించారన్నారు. విశాఖపట్నంలో మకాం వేసి సింహాచలం అప్పన్నస్వామి భూములను కాజేశారని, అక్కడ ఈవోగా ఉన్న అధికారి ప్రభుత్వ దురాగతాలకు తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్లిపోయింది నిజం కాదా అని బొండా ప్రశ్నించారు. శ్రీశైలం దేవస్థానంలో కోట్లరూపాయల విలువచేసే టిక్కెట్లకుంభకోణం జరిగినా, భక్తుల సొమ్ముని కొట్టేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఇది నిజంగా దారుణం….
ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే అరాచకశక్తులు హిందూ దేవాలయాలపై దాడులుచేస్తూ, రథాలు తగులబెట్టారని బొండా ఉమమహేశ్వరరావు ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్నిమతాలకు రక్షణగా నిలిచి, ప్రజలకు సమస్యలు లేకుండా చేస్తే, ఈ ప్రభుత్వం అరాచక శక్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. పిఠాపురంలో 23 దేవాలయాలపై దాడిచేసి, విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. హిందువులు పరమపవిత్రంగా భావించే దేవాలయాలపై దుండగులు, ముష్కరులు తెగబడుతుంటే, ప్రభుత్వం చోద్యంచూస్తూ కూర్చుందన్నారు.
పవన్ మాటలే …టీడీపీ నోటి వెంట?
శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందని, దాన్ని చంద్రబాబు ప్రభుత్వం విదేశాలకు తరలించిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టినవారు, ఇప్పుడు దానిపై ఎందుకు విచారణ జరపలేదో సమాధానం చెప్పాలని బోండా ఉమా మహేశ్వర రావు అన్నారు. ప్రభుత్వ అండదండలు లేకుండా, కొన్ని లక్షలమంది మనోభావాలతో ఆటలాడే దుస్సాహాసానికి సామాన్యుడు ఒడిగట్టడని, అంతర్వేది రథందగ్ధంవెనుక ఎవరున్నా రో తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమన్నారు. ప్రతిపక్ష సభ్యులు తమ దృష్టికి వచ్చిన సమస్యలనుప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని, దానిపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పాలకులదేనని బోండా ఉమా అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఏనాడూ లేనివిధంగా హిందువులపై, దేవాలయాలపై, దాడులు జరుగుతున్నా, ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నా పీఠాధిపతులు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిచడం లేదన్నారు. కాగా, సీబీఐ విచారణ సహా వివిధ అంశాలను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం స్పందించిన సంగతి తెలిసిందే.