స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది.మొన్నటి అసెంబ్లీ ,లోకసభ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న టిడిపి ఈ ఏడాదిన్నర కాలంలో పుంజుకున్న దాఖలాలు లేనప్పటికీ వైసిపి ప్రభుత్వంపై కనిపించనంత అసంతృప్తి ప్రజల్లో ఉందని ఆ పార్టీ అంచనా వేస్తోంది.
మార్చి నెలలో జరగాల్సిన స్థానిక సంస్థలు వాయిదా పడ్డానికి దారితీసిన కారణాలు ఆ తర్వాత సంభవించిన పరిణామాలు అందరికీ తెలిసినవే.అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై హైకోర్టులో విచారణ జరుగుతోంది.వైసిపి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని చెబుతుండగాస్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు జరపడానికి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయంటున్నారు.ఈ కేసు విచారణ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సైతం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వచ్చిన ఇబ్బందేమిటని హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా రాష్ర్టంలో మోగే సూచనలు గోచరిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో త్వరగా ఎన్నికలు జరిగితే బాగుంటుందని టిడిపి ఉత్సాహపడుతోందని సమాచారం.రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాల పైన పెట్టిన దృష్టిని అభివృద్ధిని మీద పెట్టడం లేదన్నది నిర్వివాదాంశం. సంక్షేమ పథకాలతో ప్రజలను సంతృప్తి పరిస్తే చాలు ఓట్ల వర్షం కురస్తుందనది ముఖ్యమంత్రి జగన్ లెక్క కావచ్చు.అందుకే ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ నెలకో సంక్షేమ పథకం ద్వారా ప్రజల బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నారు.అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కింది. ఈ కారణంగా రాష్ట్రంలో పల్లెలు మొదలు పట్టణాల వరకు సమస్యలు పేరుకుపోయాయి.అంతేగాక కరోనా కారణంగా మధ్యతరగతివర్గాలు బాగా దెబ్బతిన్నాయి.వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయమూ అందడం లేదు.
మరోవైపు ఉద్యోగుల జీతాలను కరోనా పేరుతో కట్ చేయడం,బకాయి ఉన్న కరువు భత్యాలను ఇవ్వకపోవడం ,పీఆర్సీ నివేదికను పెండింగ్లో ఉంచటం వంటి కారణాల వల్ల ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది.రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కొత్త పరిశ్రమలేవీ ఏపీకి రాకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహలకు గురవుతున్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం పేదలను తప్ప ఇతర వర్గాలను వీటిని పట్టించుకోవడం లేదన్నది ప్రధాన విమర్శ.వారికి సమస్యలు ఉంటాయన్నదాన్ని జగన్ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదంటున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు గనుక జరిగితే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఎంతోకొంత ఎడ్జి ఉంటుందన్నది చంద్రబాబునాయుడు లెక్కగా కనిపిస్తోంది.అందుకే స్థానిక సంస్థల కోసం టిడిపి ఆశగా ఎదురుచూస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.