తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదట..! ఏమో నిజమే కావచ్చు…!! ఏడాదిలో జగన్ పరిపాలన అద్భుతంగా ఉందట..! ఏమో ఇది నిజమే కావచ్చు…!! టీడీపీలోని మరో పది ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరుకోవచ్చట..! ఏమో ఇది కూడా నిజమే కావచ్చు…!! కానీ ఈ మాటల వెనక ఆంతర్యం ఏమిటి..? కారణం ఏమిటి..? సందర్భం ఏమిటి..? ఇదే ఇప్పుడు అసలు చర్చ. ఈ మాటలు అన్నది రాజకీయాల్లో చంద్రబాబు సమకాలికుడు అయిన కరణం బలరాం. ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే. ఈయన 50 రోజుల కిందట జగన్ ను కలిసి.., మద్దతు పలికారు. ఈరోజు పైన చెప్పుకున్న పలుకులు పలికారు. కాసేపు ఆయన్ను చీరాల ఎమ్మెల్యే గానూ.., చీరాల రాజకీయాలకు దూరంగానూ చూసుకుంటే…. చంద్రబాబు సమకాలికుడుగా, జగన్ కి మద్దతు ఇచ్చిన వ్యక్తిగానే చూసుకుందాం.
50 రోజుల తర్వాత…!
బలరాం.. జగన్ ను కలిసి కుమారుని వైసీపీలో చేర్చి, తాను జగన్ కు మద్దతు పలికి 50 రోజులు గడిచింది. ఇన్నాళ్ళు చంద్రబాబును నోరెత్తి మాట్లాడలేదు. జగన్ నీ పొగడలేదు. కానీ ఆకస్మికంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎడాపెడా చెప్పేసారు. తన నరంలోనూ వైసీపీ రక్త ప్రవాహం మొదలయ్యిందని చాటారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. నిజానికి టిడిపి నుండి గెలిచి జగన్ కి మద్దతు పలికిన వారిలో ఈయన మూడో ఎమ్మెల్యే. గతంలో వల్లభనేని వంశీ జగన్ ను కలిసి వచ్చిన వెంటనే చంద్రబాబును ఆపాదమస్తకం ఆడుకున్నారు. ఇటు బాబు బ్యాచ్ నుండి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. మొత్తానికి ఢీ అంటే ఢీ అన్నారు. మరో ఎమ్మెల్యే మద్దాల గిరి కూడా జగన్ను కలిసిన వెంటనే చంద్రబాబును, టిడిపిని విమర్శలతో ముంచెత్తారు. కానీ బలరాం మాత్రం 50 రోజులకు పైగా సైలెంట్ గా ఉంటూ.., ఈరోజు బాబును తిట్టి.., జగన్ ని పైకెత్తారు. ఇదే కీలకం, ఇదే వ్యూహం, ఇదే పాయింటు.
జగన్ తత్వం ఆలస్యంగా గ్రహించారా…?
నిజానికి జగన్ వ్యక్తిత్వం బాగా తెలిసిన వారు ఎవరైనా… అతనికి భజన చేస్తారు. జగన్ కు “తనను పొగిడిన వారన్నా…, చంద్రబాబును తిట్టిన వారన్నా… భలే ఇష్టం. వాళ్లని తన నెత్తిన పెట్టుకుంటారు. ముందూ, వెనుక చూడకుండా తగిన కుర్చీలో కూర్చో పెడతారు. ఒకరకంగా జగన్ “బోలా తత్వం” ఉన్న వ్యక్తి. కానీ కరణం బలరాం ఇది ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. అందుకే 50 రోజులు తర్వాత తెరపైకి వచ్చారు. ఉన్నట్టుండి “జగన్ ను పొగిడిన జాబితాలో బాబు ని తిట్టిన” జాబితాలో చేరిపోయారు. తనలో టిడిపి లేదని తన నరంలో వైసిపి ప్రవాహం మొదలైంది చెప్పకనే చెప్పారు. కానీ ఇక్కడ ఇంకా పాయింట్లు ఉన్నాయి.
కీలక అంశాలను పక్కన పెట్టి…!
దీని వెనుక కూడా ఆసక్తికరమైన పరిణామాలు ఉన్నాయి. జగన్ యాభై రోజుల గ్యాప్ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టి తనలోని వైసిపి రక్తపు బొట్టు చూపించారు. ఒక ప్లాన్, ఒక ముందస్తు వ్యూహం ఇవన్నీ కలగలిసి కరణం బలరాం ముందుకు వచ్చారు. ఇక్కడ కూడా అందరిలాగానే మాట్లాడారు. నిజానికి బలరాం చెప్పాలే గానీ చంద్రబాబు చరిత్ర అంతా విప్పి చెప్పేయొచ్చు. 1974 నుండి చంద్రబాబు రాజకీయం తెలిసిన వ్యక్తిగా బలరాం చాలా కీలక అంశాలను చెప్పే వీలుంది. కానీ నామమాత్రంగా “జగన్ ను పొగడాలి బాబుని తిట్టాలి” అనే ప్రాథమిక సూత్రానికి కట్టుబడి కొన్ని విమర్శలు చేశారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాల్లో ఆలోచించాల్సిన అంశంగా మారింది. వల్లభనేని వంశీ, మద్దాల గిరి భిన్నంగా బలరాం వ్యవహారం మారింది.