అధికారం మారినప్పుడు పథకాల పేర్లు మారడం అత్యంత సహజం. పథకం మరియు దాని ద్వారా ప్రజలకు వచ్చే లబ్ధి ఒకటే అయినా కూడా ముందు నాయకుల పేర్లు మాత్రం మారుతూ ఉంటుంది. అసలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల పేర్లను పెట్టే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ. అలాగని తమకు సంబంధంలేని పార్టీ వ్యక్తుల పేర్లు కూడా అవతలి ఎంత గొప్పవాడైనా మరియు అతనే పథకాన్ని రూపొందించినా పెట్టే సమస్యే లేదు. కానీ ఇప్పుడు టిడిపి మాత్రం ఇలాంటి ఒక సాహసాన్ని వైసిపిని చేయమని కోరుతుంది. కాదు…. కాదు డిమాండ్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఏపీ ఉన్న రోజుల్లో సీఎం గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్ది మొట్టమొదటిసారి ‘సున్నా వడ్డీ’ పథకాన్ని అమలు చేశారు. అయితే తాజాగా ఇప్పుడు ఇదే పథకానికి జగన్ సర్కారు పేరు మార్చి ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణం’ గా అమలు చేస్తోంది. మొన్నటిదాకా ఎన్టీఆర్ మరియు చంద్రన్న పేర్ల పై టిడిపి పథకాలు ఉన్నాయి. ఆ రెండు పేర్లు తప్ప మరొక పేరు వినిపించలేదు. ఇప్పుడు వాటి స్థానాల్లో వైయస్సార్ మరియు జగనన్న పేర్లు వచ్చేశాయి. దీనికి రాష్ట్ర ప్రజలు కూడా బాగా అలవాటు పడిపోయారు. అయితే తాజాగా ఈ సున్నా వడ్డీ పథకం యొక్క పేరు పై టీడీపీ చేసిన డిమాండ్ మాత్రం విచిత్రంగా ఉంది.
కిరణ్ కుమార్ రెడ్డి పేరుతోనే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలని ఏకంగా టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేయడం తో అందరూ ముక్కున వేలేసుకున్నారు. వైసీపీ నేతలు దెబ్బకు ఒకింత షాక్ కు గురయ్యారు అనే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ పలు నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే అందరూ హర్షిస్తారు కానీ ఇలా ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పేరుని వైసీపీ పథకానికి పెట్టమని డిమాండ్ చేయడమే ఎంతో విడ్డూరంగా ఉంది. అసలు దీనిలో ‘ఆదర్శవంతం’ అన్న మాటకు కనీసం స్కోప్ కనిపించడం లేదని వైసీపీ నేతలు ఎద్దేవా వేస్తున్నారు.