తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తరద్వారం గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఏకాదశి సందర్భంగా నాలుగు వేల పాసులు జారీ చేసిన టీటీడీ ముందుగా వీఐపీలకు వైకుంఠ ద్వారా దర్శన భాగ్యాన్ని కల్పించింది. తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్న వారిలో.. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత మాలోత్ ఉన్నారు. ఏపీ మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఏపీ సీఎస్ నీలం సాహ్ని, గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఏపీ హైకోర్టు సీజే మహేశ్వరి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖులు.. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సుమలత, కమెడియన్ సప్తగిరి తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నారు.
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విషయంలో ఎలాంటి మార్పూ లేదని, అమల్లో ఉన్న సంప్రదాయాన్నే కొనసాగిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వైకుంఠ ద్వారం గుండా వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేల మంది భక్తులు క్యూలైన్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.