తెలంగాణలో పాలన ఎలా జరుగుతుంది? అద్భుతం..! మరి సంక్షేమం? అద్భుతం..! ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే అని చెబుతున్నాయి బీసీ సంఘాలు! ఇప్పుడంటే కరోనా వచ్చింది కాబట్టి పాలనలో కాస్త ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు కానీ.. గతంలో అలా లేదు కదా? ఇది ఇప్పటి ముచ్చటకాదు.. గత మూడేళ్లుగా ఉన్న సంగతి అంటున్నారు బీసీ నేతలు!
తెలంగాణలో బీసీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ సర్కార్ వారి విషయంలో చిన్న చూపు చూస్తుందని, కరోనా కష్టకాలంలో కూడా వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయీ బీసీ సంఘాలు. ఇందులో భాగంగా జూలై 7న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించాయి. దీనికి వారు చెబుతున్నవి రెండు కారణాలు! కాగా, వాటిలో ఒకటి కరోనా కారణంగా చేతి వృత్తులు దెబ్బతిన్నాయని.. చేతివృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలకు రూ.20 వేల ఆర్ధిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే క్రమంలో ఇప్పటివరకూ బీసీ కార్పొరేషన్ లో సుమారు 5,77,000 ధరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. ఇదేదో కరోనా సమయంలో చేసినవి కాదని.. బీసీ కార్పొరేషన్ లో ఈ ఐదులక్షల డెభై ఏడు వేల మంది మూడేళ్ల కిందటే రుణాల కోసం ధరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు. ఈ మేరకు ఈ రుణాలు వెంటనే మంజూరు చేయాలంటూ సుమారు 14 బీసీ సంఘాలు కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశాయి. దీంతో… తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ఆర్థికంగా అణచివేస్తున్నారని ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
ఈ కరోనా సమయంలో ఈ వ్యవహారం, ఈ ఆందోళన కేసీఆర్ కు మరో తలనొప్పిగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. కరోనా సమయంలో ఉద్యమ తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపించినా.. దాని ప్రభావం మాత్రం ప్రభుత్వంపై అధికంగానే ఉండొచ్చని అంటున్నారు!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?