ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ అపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందగా, వీరిని పరామర్శించకుండా సీఎం కేసిఆర్ బీహార్ వెళ్లడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. బుధవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ .. రికార్డు కోసం గంటలో 34 మందికి కు.ని ఆపరేషన్లు చేయడం కేసిఆర్ ప్రభుత్వ మూర్ఖత్వమేనని మండిపడ్డారు. పేదల ప్రాణాల కంటే కేసిఆర్ సర్కార్ కు పేరు ప్రఖ్యాతులే ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ కు పేదల ఉసురు కచ్చితంగా కొడుతుందని శాపనార్ధాలు పెట్టారు.
చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఒప్పుకోమని అన్నారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో ఒక్క పేద కుటుంబాన్ని కూడా సీఎం కేసిఆర్ పరామర్శించలేదనీ, రాష్ట్రంలో పేదలను వదిలివేసి పంజాబ్, బీహార్ లో డబ్బులు పంచడం అన్యాయమని అన్నారు. సీఎం కేసిఆర్ మనిషి కాదు. రాక్షసుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. చనిపోయిన మహిళల పిల్లల చదువు, భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. కేసిఆర్ కు రాజకీయాలే తప్ప పేదల బాధలు పట్టవని విమర్శించారు. కనీసం మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాధితులను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈ ఘటనపై సీఎం కేసిఆర్ క్షమాపణ చెప్పాలనీ, వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశానికి ముందు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో బాధిత మహిళలను బండి సంజయ్ పరామర్శించారు.