తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు చెందిన ఫేస్ బుక్ ఖాతాలను నిలిపివేశారు. తన ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, సమాజంలో అనిశ్చితికి కారణమవుతున్నారన్న కారణంగా ఆయన ఖాతాలను బ్యాన్ చేసింది. ఇటీవలే సింగ్ ముస్లింలను దేశద్రోహులుగా ముద్ర వేశారు. అలాగే రోహింగ్యా శరణార్థులను కాల్చిపారేయాలని ఒక పోస్ట్ లో రాసారు.
వీటితో పాటు ఎప్పటినుండో వివాదాలకు కేంద్రబిందువవుతోన్న కారణంతో రాజా సింగ్ కు చెందిన ఐదు ఖాతాలను ఫేస్ బుక్ బ్యాన్ చేసింది. వీటిలో కొన్ని పేజీలకు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఈ విషయంపై రాజా సింగ్ స్పందిస్తూ ఫేస్ బుక్ తన ఖాతాలను 2018లోనే బ్యాన్ చేసిందని, తనకు కేవలం యూట్యూబ్, ట్విట్టర్ ఖాతాలు మాత్రమే ఉన్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని తెలిపారు.