Pawan Kalyan: పవన్ కల్యాణ్ Pawan Kalyan ను తేలిగ్గా తీసుకున్నామా? పవన్ తో సన్నిహితంగా ఉంటే బాగుండేదా? ఇవన్నీ తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా చర్చకు వస్తున్నాయా? కేంద్రంలోని బీజేపీ పెద్దలు, ఏపీ బీజేపీ పవన్ కు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి తెలంగాణ బీజేపీ ఆత్మవిమర్శ చేసుకుంటోందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో రెబల్స్, అసంతృప్తులు బీజేపీని వీడటం బీజేపీని ఇరాకాటంలో పడేసింది. ఇవన్నీ చూసి మళ్లీ పవన్ తో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తెలంగాణ బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 18 మంది జనసైనికులు నామినేషన్లు వేస్తే పవన్ తో చెప్పించి వారిని వెనక్కు తగ్గేలా చేసింది బీజేపీ. ఆ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు పవన్. అనుకన్నట్టే బీజేపీ అధికార టీఆర్ఎస్ కు భారీ షాకే ఇచ్చింది. అయితే.. కొందరు బీజేపీ నేతల వ్యాఖ్యలతో తెలంగాణ బీజేపీ తమకు విలువ ఇవ్వడం లేదని గ్రహించారు పవన్. ఫలితంగా ఎమ్మెల్సీ ఎన్నికల రోజునే తెలంగాణ బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు పవన్. మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవికి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సందర్భాల్లో తెలంగాణ బీజేపీ నిజంగానే పవన్ ను అసలు లెక్కలోకి తీసుకోనట్టే వ్యవహరించింది.
ఇదే ఇప్పుడు వారిని అంతర్మధనంలో పడేసిందని తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఏపీ బీజేపీ పవన్ కు పల్లకీ మోస్తోంది. 2024, 2029లో కూడా తమ పొత్తు కొనసాగుతుందని .. తమ సీఎం అభ్యర్ధి పవన్ అంటూ ప్రకటించేసింది. మోదీ కూడా పవన్ ను జాగ్రత్తగా చూసుకోమన్నారనే సోము వీర్రాజు వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇందులో పావు శాతం కూడా పవన్ పై తెలంగాణ బీజేపీ ప్రదర్శించ లేదు. ఇప్పుడు సాగర్ ఉప ఎన్నికలో పార్టీ వీడుతున్నవారితో సతమతమవుతోంది బీజేపీ. దీంతో పవన్ మద్దతు కోసం తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతుందో కానీ.. ఇంత జరిగాక పవన్ కలుస్తారా అనేది సందేహమే..!