తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్బంగా రేపు (శనివారం) హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా హజరుకానున్నారు. హైకోర్టు అనుమతితో బండి సంజయ్ పాదయాత్ర పునః ప్రారంభం అవుతుండగా, బహిరంగ సభకు పోలీస్ పర్మిషన్ లేకపోవడంతో అనుమతి లేని సభకు తమ కళాశాల గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. బహిరంగ సభ నిర్వహణకు పార్టీ చెల్లించిన రూ. 5లక్షలను ప్రిన్సిపాల్ తిరిగి వెనక్కి ఇచ్చేశారు. దీంతో బీజేపీ బహిరంగ సభ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. బహిరంగ సభ అనుమతి కొరకై ఈ రోజు హైకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఒక వేళ బహిరంగ సభకు అనుమతి లభించకపోతే రోడ్ షో నిర్వహణకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మూడు రోజుల క్రితం నిలిచిపోయిన బండి సంజయ్ పాదయాత్ర కోర్టు అనుమతితో ఈ రోజు తిరిగి ప్రారంభించారు. పాంనూర్, ఉప్పగల్, కూనూరు , గర్మేపల్లి, నాగపురం మీదుగా పాదయాత్రను కొనసాగించి రాత్రి వరకూ వీలైనంత దూరం నడిచే అవకాశం ఉంది. రేపు వరంగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించి ముగింపు బహిరంభ లేదా రోడ్ షో నిర్వహించనున్నారు. సభకు ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత అనుమతి రద్దు చేయడం సరికాదని బీజేపీ నేత మనోహర్ రెడ్డి అన్నారు. బహిరంగ సభ అనుమతి కోసం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. బీజేపీకి వస్తున్న స్పందనకు భయపడే సభకు అనుమతి నిరాకరించారని పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ నిర్వహించి తీరుతామని ఆమె స్పష్టం చేశారు.