తెలంగాణ సీఎం కేసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో దాదాపు అయిదు గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న 36లక్షల ఆసరా పింఛన్లకు అదనంగా కొత్తగా పది లక్షల ఫించన్లు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. కొత్త ఫించన్లు ఆగస్టు 15 నుండి పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కల్గిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. పెళ్లిల్లు, శుభకార్యాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి నేపథ్యంలో ఈ నెల 21న నిర్వహించతలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేబినెట్ లో చర్చ జరిగింది.
కేబినెట్ నిర్ణయాలు ఇవి
- వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు
- ప్రజా సమస్యల పై కమిటీ వేయాలని నిర్ణయం
- తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాలు కేటాయింపు
- సరోజిని దేవి కంటి ఆసుపత్రికి లో భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనల తయారు చేయాలని కేబినెట్ ఆదేశించింది
- షాాబాద్ లో బండల ఫాలిషింగ్ యూనిట్ల ఏర్పాటునకు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం
- ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలి
- కోటి ఈఎన్టీ ఆసుపత్రికి పది స్పెషలిస్ట్ వైద్య పోస్టులు మంజూరు, ఆసుపత్రిలో సౌకర్యాలతో ఈఎన్టీ టవర్ నిర్మించాలని నిర్ణయం