హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కెసిఆర్ అసెంబ్లీలో పలు అంశాలను ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎస్సి వర్గీకరణ, ముస్లింల రిజర్వేషన్లపై అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిపంపితే అతీగతి లేదని అన్నారు. రిజర్వేషన్లపై కేంద్రం పెద్దనం ఏమిటమి కెసిఆర్ నిలదీశారు. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తేడా ఏమిలేదని కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్ విధానాలతోనే దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలబడిందని కెసిఆర్ విమర్శించారు.
ముస్లిం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై టిఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా ఉందనీ, మైనార్టీ రిజర్వేషన్లపై కేంద్రమే నానుస్తోందనీ కెసిఆర్ విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లల అంశం అవసరమైతే మరో సారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. ఎన్ఆర్సిపై కేంద్రం నుండి ఎటువంటి అదేశాలు రాలేదనీ, రాష్ట్ర ప్రభుత్వం కుడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదనీ కెసిఆర్ చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడిగితే పట్టించుకోలేదని కెసిఆర్ విమర్శించారు.తెలంగాణకు బిజెపి ఏమి ఇవ్వకపోగా రాష్ట్రాన్ని అవమానిస్తోందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మాటలు మోది మానుకోవాలని కెసిఆర్ హితవుపలికారు. తెలంగాణ ఏర్పాటు డార్క్ డే అని అమిత్ షా అన్నారనీ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడం సరికాదనీ సిఎం అన్నారు.
తెలంగాణ వచ్చినా కాంగ్రెస్ నేతలు కుట్రలు ఆపడం లేదనీ, ప్రాజెక్టులు, ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు వేశారనీ కెసిఆర్ విమర్శించారు. తెలంగాణ ఇచ్చి తప్పుచేశామని మాట్లాడటం సరికాదని కెసిఆర్ అన్నారు. సరిహద్దు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం కంటే టిఆర్ఎస్ పాలన గొప్పగా ఉందని కెసిఆర్ చెప్పారు. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంకో రెండు మూడు పథకాలు ఉన్నాయి. అవి తీసుకువస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇక ఉండదని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. మరో మూడు దఫాలు టిఆర్ఎస్దే అధికారమని కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.