తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రేపు, ఎల్లుండి అంటే జులై 20, 21 తేదీల్లో రెండు ప్రధాన అంశాలపై దృష్టి పెడుతున్నారు. ఈ రెండు రోజులు కేసీఆర్ బిజీగా రెండు కీలక రంగాలపై దృష్టి సారిస్తారని సీఎంఓ తెలిపింది. ఓ వైపు కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే సీఎం కేసీఆర్ ఏ రెండు రంగాలపై దృష్టి పెడుతున్నారు అన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.
విషయంలోకి వెలితే..రాష్ట్రంలో నీటి పారుదల వ్యవస్థ..భారీ, మధ్యతరహా, చిన్న తరహా, ఐడిసి, ప్రాజెక్టులు, ప్యాకేజీలు పేరుతో విభజించబడి ఉన్నది. అయితే వీటన్నంటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని, తద్వారా పర్యవేక్షణ పటిష్టంగా జరుగుతుందని సిఎం కేసీఆర్ భావించారు. అందుకే నీటి పారుదల శాఖను 15-20 ప్రాదేశిక విభాగాలుగా మార్పు చేసి, ఒక్కో దానికి ఒక్కో సిఈని ఇంచార్జిగా నియమించాలని అయన నిర్ణయించారు. ఆ సిఈ పరిధిలోనే ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువలు, చెరువులు, చెక్ డ్యామ్లు ఉండనున్నాయి. దీనికి సంబంధించి ముసాయిదా తయారు చేయాలని గత వారం జరిగిన సమీక్షలో అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ రెండు రోజుల పాటు నీటి పారుదల శాఖ పునర్వ్యవస్థీకరణపై వర్క్ షాపు నిర్వహించి, ముసాయిదాను రూపొందించారు. దీనిని సోమవారం ముఖ్యమంత్రి సీఎంకు అందజేస్తారు. ఈ ముసాయిదాపై సమీక్షలో సమగ్ర చర్చ జరిపి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మరో వైపు తెలంగాణ సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం.. తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. మంగళవారం సమీక్షలో డిజైన్లపై చర్చించనున్నారు. సచివాలయం బాహ్యరూపం, లోపల సౌకర్యాలు తదితర అంశాలపై చర్చిస్తారు. తదుపరి వాటిని మంత్రి మండలిలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణం ప్రారంభిస్తారు.