ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమయానుకూలంగా ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. పెద్ద నోట్ల రద్దు , జీఎస్టీ అమలు వంటి విషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ మిత్రపక్షాలతో సమానంగా మద్దతు ఇచ్చారు. అమలు గురించి నొక్కి చెప్పారు.
అయితే అనంతరం పలు విషయాల్లో బీజేపీతో తెలంగాణ సీఎం కేసీఆర్ విబేధించారు. ఇంతకూ బీజేపీకి టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీయా? మద్దతు ఇచ్చే పార్టీనా అనే విషయంలో క్లారిటీ రాకుండా కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న పరిస్థితి. అలాంటి వారికి షాకిచ్చేలా తాజాగా తెలంగాణ సీఎం తన వైఖరి ప్రకటించారు.
కేసీఆర్ సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేకమార్లు కేంద్రప్రభుత్వం రైతులతో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫలవంతం కాలేదు. మరోమారు చర్చలు జరపబోతున్నారు. అయితే, చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8 వ తేదీన భారత్ బంద్కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు మద్దతు ఇచ్చాయి. అలాగే టీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం మద్దతు ఇస్తూ పార్టీ నేతలు రోడ్లు ఎక్కాలని కీలక పిలుపు ఇచ్చారు.
ఏం చేయాలో చెప్పిన కేసీఆర్
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రైతు సంఘాల పిలుపు మేరకు రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. భారత్ బంద్ విజయవంతానికి టిఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. బంద్ ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో మరోమారు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆందోళన బాట పట్టనున్నారు. తెలంగాణ సీఎం తీసుకున్న ఈ నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడటం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?